టీఆర్ఎస్ , ఎంఐఎం ఇద్దరు దొంగలు కలిసే .. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు : రాజా సింగ్ ఫైర్
హైదరాబాద్ మేయర్ ఎన్నికతో అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడిందని బిజెపి నేతలు రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసి కార్యాలయంలో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారోత్సవంలో ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారని, టీఆర్ఎస్ ,ఎంఐఎం పార్టీ రెండు వేరు వేరు కాదనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఎంఐఎం చెంచా .. చీకట్లో ప్రేమించుకుంటూ బయట డ్రామాలు : బండి సంజయ్ ధ్వజం
ఎన్నికల్లో సంబంధం లేదన్నారు .. ఇప్పుడు మద్దతు ఎలా ?
టిఆర్ఎస్ పార్టీ తన గోతిని తానే తవ్వుకుందని పేర్కొన్న ఎమ్మెల్యే రాజాసింగ్ అటు టీఆర్ఎస్ , ఇటు ఎంఐఎం, ఇద్దరు దొంగలు కలిసే మేయర్ ను గెలుచుకున్నారు అని విమర్శలు గుప్పించారు . ఎన్నికల సమయంలో ఎంఐఎంతో సంబంధం లేదని చెప్పిన టిఆర్ఎస్ పార్టీ, ఇవాళ మేయర్ ఎన్నికపై ఎంఐఎం మద్దతు తీసుకున్నారని, అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు దొంగలు కలిసి నాశనం చేశారని పేర్కొన్నారు రాజా సింగ్ .
ఎంఐఎం టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతిచ్చింది?
ఇప్పుడు కూడా మళ్లీ ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు గ్రేటర్ హైదరాబాద్ ను నాశనం చేయడానికి రంగంలోకి దిగాయని విమర్శించారు. రెండు రోజుల క్రితం మేయర్ ఎన్నికకు పోటీ చేస్తామని చెప్పిన ఎంఐఎం, ఇవాళ కౌన్సిల్ లో టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతిచ్చింది అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో ఏం జరిగిందని ప్రశ్నించారు .లోపాయికారీ ఒప్పందాలు చేసుకునే ఇద్దరు దొంగలు ఒకటేనని ఈరోజు నిరూపితమైంది అని రాజా సింగ్ పేర్కొన్నారు.
రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే టీఆర్ఎస్ పార్టీకి 15 సీట్లు వచ్చేవి కాదు
ఎన్నికల సమయంలో తమ మధ్య పొత్తు లేదని చెప్పిన రెండు పార్టీలు ఇప్పుడు మేయర్ ఎన్నికల్లో ఎలా కలిశాయని, ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఎలా మద్దతు తెలిపిందని ప్రశ్నించారు రాజాసింగ్ . జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే టీఆర్ఎస్ పార్టీకి 15 సీట్లు మించి వచ్చేవి కాదని రాజాసింగ్ పేర్కొన్నారు. రెండు పార్టీలు తమ బొంద తామే తీసుకున్నాయని , ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని రాజా సింగ్ పేర్కొన్నారు.