నన్ను చంపేందుకు కుట్ర, పోలీసులకు పట్టదా?, నేనే చూసుకుంటా: రాజా సింగ్ వార్నింగ్
హైదరాబాద్: తాను చంపేందుకు కుట్ర జరుగుతోందని గోషామహల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోద్ చెప్పారు. మహారాష్ట్రలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి వస్తుండగా తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. ఆ కార్యక్రమానికి వెళ్లొద్దని కూడా తనకు బెదిరింపులు వచ్చాయని అన్నారు.
అయితే, ఆ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా తన కారును లారీ ఢీకొట్టించి చంపాలని చూశారని చెప్పారు. తన డ్రైవర్ చాకచక్యంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. అయితే, ఆ లారీ తన కారు అనుకుని మరో కారును ఢీకొట్టిందని చెప్పారు.
అంతేగాక, ఈ ఘటన తర్వాత 'ఈసారి బతికిపోయావు' అంటూ తనకు వాట్సప్ సందేశం కూడా వచ్చిందని రాజా సింగ్ తెలిపారు. తనను చంపుతామంటూ బెదిరింపులు, ఫోన్ కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాజా సింగ్ వాపోయారు.
ఒక ఎమ్మెల్యేకు కూడా పోలీసులు రక్షణ కల్పించకపోతే ఎలా అని రాజా సింగ్ ప్రశ్నించారు. వాళ్లకు చేతగాకపోతే, తన రక్షణ తానే చూసుకుంటానని వ్యాఖ్యానించారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించే వ్యక్తులు తనకు దొరికితే మాత్రం వాళ్ల పరిస్థితి మరోలా ఉంటుందని రాజా సింగ్ హెచ్చరించారు.
కాగా, మహారాష్ట్ర నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన రాజా సింగ్ అనుచరులు లారీ డ్రైవర్ను పట్టుకునే ప్రయత్నం చేయగా అతడు పారిపోయాడు. క్లీనర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో.. అతడ్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి... పరారీలో ఉన్న డ్రైవర్ను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.