ఆరోగ్య శ్రీ లేదు.!ఆయుష్మాన్ భారత్ లేదు.!కరోనా రోగులకు భీమా అందకుండా కేసీఆర్ చేతులెత్తేసాడన్న రాజాసింగ్.!
హైదరాబాద్ : కరోనా వికటాట్టహాసం చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని గోషామాల్ బీజేపి ఎమ్యెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో తీసుకోవాల్సిన చర్యల అంశంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రాజాసింగ్ మండిపడ్డారు. కరోనా బాదితులకు, కరోనా వల్ల మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆర్థికసాయం చేయడం లేదని ఆరోపించారు. కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీ లో చేర్చాలనే డిమాండ్ తారా స్థాయిలో వినిపిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు ఎందుకు స్పందించడం లేదని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదు.. టీ సర్కార్ ను సూటిగా ప్రశ్నించిన రాజాసింగ్..
తెలంగాణను కరోనా రెండో వేవ్ అతలాకుతలం చేస్తుంటే పేద, మధ్య వర్గాల ప్రజలకు ఉచిత చికిత్స అందించ వలసిన రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఎటువంటి నిధులు కేటాయించకుండా, ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపించారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు సహితం కరోనా రోగులకు అందకుండా చేయడమే కాకుండా, కార్పొరేట్ ఆసుపత్రులకు మేలు జరిగేలా వ్యవహరిస్తోందని రాజాసింగ్ మండిపడ్డారు.
ఆస్తులు అమ్ముకుంటున్నారు..అప్పులు చేస్తున్నారన్న బీజేపి ఎమ్మెల్యే..
మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ఆరోగ్య శ్రీ లో కరోనా చికిత్సను చేర్చకపోడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య భీమా పధకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటోందని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ప్రైవేటు ఆసుపత్రులు వేసే లక్షల రూపాయల బిల్లులను చెల్లించేందుకు కరోనా బాదితులు ఆస్తులు అమ్ముకోవడమో, అప్పులు చేయడమో చేస్తున్నారని, ఇది అత్యంత దయనీయమైన చర్య అని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి పరిస్దితుల నుండి ప్రజలను కాపాడాలని, అందుకోసం ప్రభుత్వం ఓ ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు.
పేట్రేగిపోతున్న ప్రయివేట్ ఆసుపత్రులు.. లక్షల్లో బిల్లులు పిండుకుంటున్న యాజమాన్యాలు..
ప్రజల ప్రాణాలను కాపాడాలనే సోయి ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు కు ఉంటె తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ , ఆయుష్మాన్ భారత్ పథకాలను వెంటనే అమలు చేయాలని రాజసింగ్ డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల బకాయిలను వెంటనే చెల్లించి ఆ తర్వాత కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21 వేల మంది కార్పరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వీరిలో సగటున ప్రతి ఒక్కరూ రోజూ 50 వేల రూపాయల వరకూ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, అంటే రోజుకు వంద కోట్ల రూపాయల వరకు ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయని రాజాసింగ్ మండిపడ్డారు.
Recommended Video
ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.. ప్రజలు ఆర్దికంగా చితికిపోతున్నారన్న బీజేపి ఎమ్మెల్యే..
అంతే కాకుండా ప్రతిపక్షాల నుండి ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో కరోనా ను ఆరోగ్యశ్రీలోకి చేరుస్తామని ఏడు నెలల కింద ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించి వదిలేశారని గుర్తు చేసారు. ఆయుష్మాన్ భారత్ లో చేరుస్తామని చెప్పి ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. కరోనా రెండో దశ తీవ్రమైనప్పటి నుంచీ కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లు లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయని, పైరవీలు చేసుకుంటే కానీ బెడ్లు దొరకని దుర్బర పరిస్థితులు నెలకొన్నాయని రాజాసింగ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితులు అధిగమించాలంటే రాష్ట్రంలో వెంటను కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని రాజాసింగ్ డిమాండ్ చేసారు.