మృత్యువుకు అక్కినేని సవాల్: రాజమౌళి, కెసిఆర్కు తెలుసు: నాగార్జున, వెంకయ్య పొగడ్తలు
ముఖ్యమంత్రి కెసిఆర్ జనం కోసం ఆలోచించే వ్యక్తి అని నటుడు నాగార్జున ఆదివారం అన్నారు. జనానికి ఏం కావాలో ఆయనకు తెలుసునని చెప్పారు. ప్రజలను ఎలా సంతోషపెట్టాలో కెసిఆర్కు తెలుసునని చెప్పారు.
Recommended Video
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ జనం కోసం ఆలోచించే వ్యక్తి అని నటుడు నాగార్జున ఆదివారం అన్నారు. జనానికి ఏం కావాలో ఆయనకు తెలుసునని చెప్పారు. ప్రజలను ఎలా సంతోషపెట్టాలో కెసిఆర్కు తెలుసునని చెప్పారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఆదివారం శిల్ప కళా వేదికలో ఏఎన్నార్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. కెసిఆర్ పలు పథకాలు ప్రజల కోసమే పెట్టారన్నారు. ఇక, రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు.
కార్యక్రమానికి వీరు హాజరు
ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కినేని నాగేశ్వర రావు తనయులు కుమారులు వెంకట్, నాగార్జున తదితరులు హాజరయ్యారు.
తొలిసారి గుండెపోటు వచ్చినప్పుడు
ఏఎన్నార్ జాతీయ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని, పురస్కారానికి గౌరవం తెచ్చేలా మరింత కష్టపడతానని రాజమౌళి ఈ సందర్భంగా అన్నారు. 1974లో ఏఎన్నార్కు 55 సంవత్సరాలని, ఆయనకు గుండెపోటు వచ్చిందని, చాలా పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఆపరేషన్ చేశారని, విజయవంతంగా పూర్తయిన తర్వాత.. సర్ మీ గుండె 14 సంవత్సరాల పాటు గ్యారెంటీగా పని చేస్తుందని వైద్యులు చెప్పారని రాజమౌళి అన్నారు. వాళ్లు చెప్పినట్లుగానే ఏ సమస్య లేకుండా గడిచిందన్నారు.
రెండోసారి గుండెపోటు
1988లో మళ్లీ రెండోసారి గుండెపోటు వచ్చిందని, అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ప్రయత్నించగా, గుండె చాలా బలహీనంగా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని రాజమౌళి అన్నారు. మీకు గుండె బలహీనంగా ఉందని, మీరు కేవలం కొద్దివారాలు మాత్రమే బతుకుతారని నాగేశ్వరరావు గారికి డాక్టర్లు చెప్పారని రాజమౌళి అన్నారు. 'డాక్టర్లు, మందుల సాయంతో 14 ఏళ్లు బతికానని, నా విల్ పవర్తో మరో 14 సంవత్సరాలు బతుకుతానని ఆ సమయంలో అక్కినేని అనుకున్నారట అని రాజమౌళి అన్నారు.
మృత్యువుకు సవాల్, ఇక చావును రమ్మని చెప్పిన అక్కినేని
అప్పటి నుంచి అక్కినేని కారు నెంబర్లు అన్నీ 2002 అని ఉండేవని, అంటే అప్పటి వరకు తన జోలికి రావొద్దని ఆయన ఉద్దేశ్యమని రాజమౌళి పేర్కొన్నారు. ఆ తర్వాత 2002లో మళ్లీ ఆయన 2011 వరకు తనకు చావు రావొద్దని కోరుకున్నారని రాజమౌళి అన్నారు. ఇక, 2011లో ఆయనకు బోరు కొట్టి, నీవు (చావు) ఎప్పుడు అనుకుంటే అప్పుడు రావొచ్చని చెప్పారని, చివరకు దేవుడు ఆయనను మనకు శారీరకంగా దూరం చేశారన్నారు. అక్కినేని మృత్యువుకు సవాల్ చేశారన్నారు.
నాడు భీష్ముడు, నేడు ఏఎన్నార్
నేను రమ్మన్నప్పుడే నా వద్దకు రావాలని చావుతో మాట్లాడిన వ్యక్తుల్లో నాడు మహాభారతంలో భీష్ముడు అని, ఇప్పుడు అక్కినేని అని రాజమౌళి అన్నారు. అలాంటి మహానుభావుడి పేరు మీద ఉన్న అవార్డుకు తాను అర్హుడినేనా అని ఆలోచిస్తున్నానని రాజమౌళి అన్నారు. నాగార్జున తన భుజస్కందాలపై పెద్ద భారాన్ని పెట్టారన్నారు. అలాగే, 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్కు ఈ సందర్భంగా రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు.
వెంకయ్య చెప్పిన ఏడు వింతలు
తాను ఇక్కడకు వచ్చే ముందు తన మనవరాలు వైష్ణవి తనకు ఓ వాట్సప్ మెసేజ్ పంపించిందని, అందులో ఓ టీచర్ తన విద్యార్థులను ప్రపంచ ఏడు వింతల పేర్లు చెప్పమంటుందని అడుగుతుందని, విద్యార్థులంతా ఈజిప్ట్ పిరమిడ్లు, తాజ్ మహల్ అంటూ ఇలా ఏడు చెబుతారని వెంకయ్య నాయుడు అన్నారు. ఒకమ్మాయి మాత్రం సమాధానం ఇవ్వకుండా అలాగే ఉండిపోయిందని, ఆమె తన టీచర్తో చివరకు ప్రపంచంలో అద్భుతాల్లో ఒకటి చూడగలగడం, రెండు వినగలగడం, మూడు స్పర్శ, నాలుగు రుచి, ఐదు అనుభూతిని పొందడం, ఆరు నవ్వడం, ఏడు ప్రేమించడం అని చెబుతుందని వెంకయ్య తనదైన శైలిలో చెప్పారు. ఈ ఏడు అద్భుతాలను కూడా మహాద్భుతంగా చూపించగలిగేది సినిమా అని, అటువంటి సినిమాను మరింత అద్భుతంగా చూపించగలిగే దర్శకుడు రాజమౌళి అన్నారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అక్కినేని పురస్కారాన్ని రాజమౌళికి ఇవ్వడం సముచితమన్నారు.
కెసిఆర్కు ప్రశంస
సీఎం కెసిఆర్పై వెంకయ్య ప్రశంసలు కురిపించారు. తెలుగు భాషను తప్పనిసరి చేయడం గొప్ప నిర్ణయం అన్నారు. ఇతర దేశాల అధినేతలు ఇక్కడకు వచ్చినప్పుడు వారి భాషలోనే మాట్లాడుతారని, వారికి ఇంగ్లీష్ రాక కాదని, కానీ వారి భాషపై వారికి అభిమానం అన్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ల కృషి
తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. తెలుగు బిడ్డ పేరుతో పురస్కారాన్ని మరో తెలుగు బిడ్డకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అక్కినేని పురస్కారాన్ని అందుకున్న రాజమౌళి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన తీసిన బాహుబలి అద్భుత కళాఖండం అన్నారు. రాజమౌళి ట్రెండ్ సెట్టర్ అన్నారు.
సినిమాలో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చని
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చనే కొత్త ఒరవడికి రాజమౌళి నాంది పలికారని కెసిఆర్ అన్నారు. పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తిని కొనసాగించేలా ఆయన పేరుతో పురస్కారాన్ని అందిస్తున్న కుటుంబాన్ని కేసీఆర్ అభినందించారు.