ఉప్పల్ నరబలి: వెలుగులోకి మరిన్ని సంచలనాలు.. ఆర్నెళ్లుగా వాళ్లతో టచ్లో రాజశేఖర్?
హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్లో జరిగిన నరబలి కేసులో మరిన్ని సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుల నుంచి పోలీసులు ఒక్కొక్కటిగా వివరాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడు రాజశేఖర్ తల్లి, అతని అత్త మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. పోలీసులే బలవంతంగా లేని కేసును తమపై రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు.
Recommended Video
ఇంటిపై తల: క్షుద్రపూజలు, చిన్నారి బలి, క్యాబ్ డ్రైవర్ పనే
రాజశేఖర్ తల్లి:
నరబలి చేశారన్న ప్రచారంలో నిజం లేదు. కేసు మోపి చంపాలనుకుంటే చంపేయండి. పోలీసులే కొట్టి నా కొడుకు, కోడలు చేత బలవంతంగా ఒప్పిస్తున్నారట. అన్నీ అబద్దాలే. ఒకవేళ నిజంగానే నరబలి ఉంటే మాత్రం వాళ్లను చంపేయండి.
నిరూపించండి..: నిందితుడి తల్లి
నా కొడుకు, కోడలు నరబలి చేశారని పుకార్లు ప్రచారం చేస్తున్నారు. అది నిరూపించినంత తర్వాత వాళ్లను ఏం చేసినా మేం ఒప్పుకుంటాం.
రెండేళ్లుగా పూజారుల వద్దకు వెళ్తున్నారని, క్షుద్రపూజలు చేయిస్తున్నారని అంటున్నారు. భార్య ఆరోగ్యం బాగాలేకనే నా కొడుకు పూజారుల వద్దకు వెళ్లిండు. అంతే.
నరసింహా స్వామి గుడిలో నిద్ర చేసినం..:
నరబలి జరిగిందని చెప్తున్న రోజు.. నా కొడుకు డ్యూటీలోనే ఉన్నడు. కావాలంటే కంపెనీకి ఫోన్ చేసి కనుక్కోండి. అంతకు రెండు రోజుల ముందు చేర్యాల దగ్గర నరసింహా స్వామి గుడికి వెళ్లి నిద్ర చేసినం. రెండు రోజుల ముందే అక్కడికి వెళ్లినమని చెప్తున్నదాంట్లో నిజం లేదు. అక్కడ నిద్ర చేస్తే ప్రాణం బాగుంటందని చెప్తే వెళ్లినం అంతే. మాతో పాటు కొన్ని వందల మంది ఆరోజు అక్కడ నిద్ర చేసిన్రు.
కాలుకు దెబ్బ తాకిందనే..:
కోడలు కాలుకు దెబ్బ తాకింది. రెండు నెలలైనా తగ్గలేదు. అప్పటినుంచి ఆమె ప్రాణం బాగుంటలేదని నా కొడుకు పూజారుల వద్దకు వెళ్లిండు. మీరు చెప్పేది నిజమో కాదో ఆ భగవంతునికే తెలియాలి.
నిందితురాలి తల్లి:
నరసింహాస్వామి గుడిలో నిద్ర చేస్తే ఆరోగ్యం మంచిగవుతుందని చెప్తే వెళ్లినం. ఎట్ల చేసి మావాళ్ల మీద నేరం మోపాలంటే మేమేం చేయలేం. కానీ ఆ పాపను అమ్మినోళ్లను కూడా తీసుకురావాలె కదా. వాళ్లను బయటకు తీసుకొస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయి. వాళ్లు నేరం చేసినట్లు నిరూపించి ఏమైనా చేయండి
జగిత్యాల తండా నుంచి..:
జగిత్యాలకు దగ్గరలోని ఓ గిరిజన తండా నుంచి బాలికను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరు నెలలుగా రాజశేఖర్ కుటుంబం పూజారితో టచ్లో ఉన్నట్లు చెబుతున్నారు. నరబలి అనంతరం బాలిక మొండాన్ని నాచారం లక్ష్మీ ఇండస్ట్రీస్ సమీపంలో పడేసినట్లుగా గుర్తించారు.
'నరబలి'లో 10మంది పూజారులు..
నరబలి సమయంలో భార్యభర్తలు పక్కపక్కనే కూర్చున్నారని.. 10మంది పూజారులు.. 20మంది వరకు రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్న నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.