కూతుళ్లతో కలిసి ప్రధాని మోడీని కలిసిన రాజశేఖర్, జీవిత
ఢిల్లీ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని నటులు రాజశేఖర్, జీవితలు సోమవారం నాడు కలిశారు. ప్రధాని మోడీని మర్యాద పూర్వకంగానే కలిసినట్లు జీవిత తెలిపారు. వారు తమ కూతుళ్లతో కలిసి ప్రధాని మోడీని కలిశారు. వీరు కొద్ది రోజుల క్రితం బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.
నటి జీవిత బిజెపిలో చేరారు. అయితే రాజశేఖర్ అప్పుడు ఏ పార్టీలోను చేరలేదు. జీవిత పార్టీలో చేరిన కొద్ది రోజుల తర్వాత సెన్సార్ బోర్డులో మెంబర్గా నియమితులయ్యారు.
కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు: ఎంపీ సీతారాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడి కాంగ్రెస్ నేతలకు బానిస బతుకులు పోవడం లేదని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆంధ్రా నేత కొప్పుల రాజును ఎంపిక చేసే దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని పేర్కొన్నారు. ఆంధ్రా నేతల కనుసన్నల్లోనే టీడీపీ, బీజేపీ నేతలు పని చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీకి ఓట్లు అడిగే నైతికత లేదన్నారు.
టిఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల్లో అసంతృప్తి: లక్ష్మణ్
టిఆర్ఎస్ పాలన పైన అన్ని వర్గాల్లోను అసంతృప్తి నెలకొని ఉందని బిజెపి నేత లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆత్మహత్యలు ఆగాలంటే ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు.
టిఆర్ఎస్ పాలన పైన అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ, అంగన్ వాడీ, ఆశా వర్కర్ల ఆందోళనలను ముఖ్యమంత్రి, మంత్రులు అపహాస్యం చేస్తున్నారన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమి అభ్యర్థి విజయం తథ్యమన్నారు.