తెలంగాణని చూసి రాష్ట్రాలు నేర్చుకోవాలి: రాజేంద్రసింగ్, సినిమాలకు సింగిల్ విండో!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో రాజేంద్ర సింగ్ బుధవారం నాడు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుర. మిషన్ కాకతీయకు ఉదారంగా అందరూ నిధులు ఇవ్వాలని కోరారు. దీని కోసం ప్రభుత్వం రూ.25వేల కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలన్నారు.
అంతకుముందు, హరీష్ రావు నీటి పారుదల శాఖ అధికారులను రాజేంద్ర సింగ్కు పరిచయం చేశారు. మిషన్ కాకతీయ గురించిన సమాచారాన్ని హరీష్ రావు ఆయనకు చెప్పారు. దీనిపై రాజేంద్ర సింగ్ స్పందిస్తూ.. మిషన్ కాకతీయలో ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు.
మినీ థియేటర్ల కోసం తలసానితో భటీ
మండల కేంద్రాల్లో మినీ థియేటర్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అన్నారు. వారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు వాణిజ్య పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు.
ఫిలిం ఛాంబర్ కోసం ఫిలిం నగర్లో ఎకరం స్థలం కేటాయించాలని కోరారు. చిత్ర నిర్మాణం అనుమతులు పొందేందుకు సింగిల్ విండో విధానం ఏర్పాటు చేయాలన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల విజ్ఞప్తులపై తలసాని సానుకూలంగా స్పందించారు.
ఉల్లిని తరలింపుపై ఈటెల
ఉల్లిగడ్డను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉల్లి అక్రమ నిల్వల పైన అధికారులు దాడులు చేపట్టాలన్నారు. నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.