కొత్త జిల్లాలపై మొదలైన కసరత్తు: కెసిఆర్ నిర్ణయం దిశగా అడుగులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ 2న కొత్త జిల్లాలను ప్రకటించాలనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు.
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్.. ఉన్నతాధికారుల అభిప్రాయాలను సేకరించారు. మహానగర పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విస్తీర్ణం, జనసాంద్రత, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, పోలీసు కమిషనరేట్లు, సబ్డివిజన్ కార్యాలయాలు, ఇతర అంశాల సమాచారం తీసుకున్నారు.
జంట నగరాల పరిధిలో నాలుగు జిల్లాల ముసాయిదా ప్రతిపాదనలున్నట్లు వివరించిన సీఎస్.. వాటి మీద అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. రెండు జిల్లాల కలెక్టర్లు కొత్త జిల్లాల ఏర్పాటుపై సమగ్ర సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఎస్ కోరినట్లు తెలిసింది.
ఇది ఇలా ఉండగా, రాష్ట్రంలోని మిగిలిన ఎనిమిది జిల్లాల విభజనపైనా సీఎస్ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. మే మూడో వారానికల్లా భేటీలను పూర్తి చేసి ఆ తర్వాత సమగ్ర నివేదికను రూపొందిస్తారు. కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాలు, ఇతర అంశాలను ఇందులో ప్రస్తావించనున్నారు.
కాగా, కొత్త జిల్లాలు, పోలీసు కమిషనరేట్లు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమావేశం నిర్వహించాలని భావించినా చివరి నిమిషంలో అది వాయిదా పడింది. ఆయనకు మరో ముఖ్యమైన అంశం ఉండటంతో ఈ సమావేశం జరగలేదు.
దీంతో సీఎం నివాసానికి చేరుకున్న సీఎస్ రాజీవ్శర్మ, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య అధికారులు తిరిగివెళ్ళిపోయారు. కాగా, త్వరలోనే మరోసారి సమావేశాన్ని నిర్వహించాలని సీఎం నిర్ణయించడంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు.