తెలంగాణ నేతలకు రాజ్నాథ్ షాక్: కెసిఆర్తో బిజెపి దోస్తీ?
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర బిజెపి నాయకత్వానికి కేంద్ర నాయకత్వం షాకులిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్పై పోరాటం చేస్తోంటే, కేంద్ర నాయకత్వం మాత్రం టిఆర్ఎస్కు సానుకూల సంకేతాలు పంపడంతో తెలంగాణ బిజెపి నేతలకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. నిజామాబాద్ బిజెపి సభలో టిఆర్ఎస్కు అనుకూల సంకేతాలను బిజెపి కేంద్ర నాయకత్వం ఇచ్చిందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
2019 ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీచేయాలని బిజెపి నిర్ణయం తీసుకొంది. గత ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బిజెపి, టిడిపి కూటమిగా పోటీచేశాయి. అయితే తెలంగాణలో టిడిపితొ పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని భావించిన బిజెపి ఒంటరిపోరుకు సిద్దమైంది.
2019 ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా వ్యూహరచన చేస్తోంది బిజెపి, ఈ మేరకు ఇతర పార్టీల నుండి బిజెపిలోకి బలమైన నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొందరు నేతలతో బిజెపి నేతలు కూడ ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్కు వ్యతిరేకంగా బిజెపి నేతలు సీరియస్గా కార్యాచరణను తీసుకొంటోంది. అయితే బిజెపి కేంద్ర నాయకులు మాత్రం టిఆర్ఎస్ నేతల పట్ల సానుకూలంగా స్పందించడం పట్ల తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి ఇబ్బందిగా మారింది.
కమలనాథులే ఇరుకునపడ్డారు
తెలంగాణకు చెందిన బిజెపి నేతలకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ షాకిచ్చారు. కెసిఆర్పై రాష్ట్ర బిజెపి నేతలు ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తోంటే రాజ్నాథ్ మాత్రం నిజామాబాద్ సభలో మౌనముద్ర వేయడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు నిజామాబాద్ సభ నిర్వహించింది బిజెపి,అయితే బిజెపి కేంద్ర నాయకత్వం వ్యవహరించిన తీరుతో తెలంగాణ బిజెపి రాష్ట్ర నాయకత్వం ఇరకాటంలో పడింది.
టిఆర్ఎస్పై బిజెపి ఆచితూచి అడుగులు
2019 ఎన్నికల వరకు టిఆర్ఎస్ పట్ల బిజెపి ఆచితూచి అడుగులు వేయాలని బిజెపి కేంద్ర నాయకత్వం భావిస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్తో మంచి సంబంధాలు కొనసాగించాలని భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదం కోసం వారి సహకారం తప్పనిసరి. అందుకే తెలంగాణలో పర్యటించే కేంద్రమంత్రులు టీఆర్ఎస్పై దూకుడుగా విమర్శలు చేయవద్దని ఆదేశాలు ఉన్నట్లు సమాచారం.
రాజ్నాథ్ అందుకే అలా..
నిజామాబాద్ సభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ రజాకార్ల అగడాలను విమర్శించారు. అంతేకాదు మూడేళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను ప్రస్తావించారు. కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ను పల్లెత్తుమాట అనలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కూడ లేకపోలేదనే ప్రచారం కూడ ఉంది. గత ఎన్నికల సమయంలోనే టిఆర్ఎస్తో బిజెపి నేతలు పొత్తును కోరుకొన్నారు.కానీ, కెసిఆర్ మాత్రం పొత్తును వ్యతిరేకించారు.
బిజెపి వ్యూహమేమిటీ
2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసేందుకు బిజెపి వ్యూహరచన చేస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా పర్యటించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు సూచనలను చేశారు. మరోవైపు రాష్ట్ర పర్యటనకు అమిత్షా తెలంగాణకు రానున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ను, టీడీపీని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీ అధిష్టానంపై పెద్దగా విమర్శలు చేయడం లేదని అభిప్రాయపడేవారు కూడ లేకపోలేదు.