పాక్కు భారత్ను ఎదుర్కొనే సత్తాలేదు..అందుకే ఉగ్రవాదం: చైనాకు బుద్ది చెప్పాం: రాజ్నాథ్
హైదరాబాదు: భారత్పై నేరుగా యుద్ధం చేసే దమ్ము సాహసం లేక పాకిస్తాన్ ఉగ్రవాదంను అడ్డంగా పెట్టుకుని భారత్పై యుద్ధం చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాజ్నాథ్ సింగ్.. ఇదే వేదికగా చైనాపై కూడా నిప్పులు చెరిగారు.
Recommended Video
ఉగ్రవాదంతో పాక్ ఆటలు
హైదరాబాదులోని దిండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడెమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డ రాజ్నాథ్ సింగ్... ఉగ్రవాదంతో భారత్ను దొంగదెబ్బ తీయాలని చూస్తోందన్నారు. పాకిస్తాన్ పప్పులు ఏమీ ఉడకవని అదే సమయంలో ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ భారత్పై నాలుగు యుద్ధాలు చేసి ఓడిపోయిందని అయినప్పటికీ ఆదేశానికి ఎలాంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఏమీ చేతకాక ఉగ్రవాదంను ప్రోత్సహిస్తూ భారత్లో దాడులకు తెగబడే ప్రయత్నం చేస్తున్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను సరిహద్దుల్లో ధీటుగా తిప్పికొడుతున్న భారత జవాన్లను ఈ సందర్భంగా ప్రశంసించారు రాజ్నాథ్ సింగ్.
భారత రక్షణ వ్యవస్థలో వాయుసేన కీలకపాత్ర
ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్ర గురించి మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ భారత వాయుసేనకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశం ప్రమాదంలో ఉన్నప్పుడల్లా ధైరసాహసాలను ప్రదర్శించిందని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు.1971 లాంగేవాలా యుద్ధం నుంచి తాజాగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ వరకు భారత వాయుసేన కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఈ ఘట్టాలన్నీ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని అన్నారు.
చైనా ఆటలు సాగవ్..తోక కత్తిరించేస్తాం
ఇక ఇదే వేదిక నుంచి చైనాకు కూడా గట్టి సంకేతాలు పంపారు రాజ్నాథ్ సింగ్. కరోనావైరస్ కష్ట సమయాల్లో లడాఖ్ ప్రాంతంలో చైనా చొరబాట్లకు పాల్పడిందని, అంత నీచ స్థాయికి దిగజారిందని డ్రాగన్ కంట్రీపై మండిపడ్డారు రాజ్నాథ్ సింగ్. అయితే చైనా బలగాలు భారత భూభాగంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా మన సైన్యం ఎలాంటి సమాధానం ఇచ్చిందో ప్రపంచ దేశాలు కూడా చూశాయని గుర్తు చేశారు. సరిహద్దుల్లో సమస్యలకు పరిష్కారం శాంతియుత వాతావరణంలో జరగాలన్నదే భారత అభిమతమని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. యుద్ధం చేయాలన్నది భారత ఉద్దేశం కాదని శాంతియుతంగా సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నదే అజెండా అని చెప్పారు.అయితే భారత సార్వభౌమాధికారంపై దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.