రాజ్యసభ షెడ్యూల్: జగన్కు షాకిచ్చేనా, బాబుకు 'తెలంగాణ' చిక్కు, కెసిఆర్ దయ ఎవరిపై?
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. ఈ నెల 24వ తేదీన పదిహేను రాష్ట్రాలలోని 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు, ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలంగాణ నుంచి వీ హనుమంత రావు (కాంగ్రెస్), గుండు సుధారాణి (టిడిపి నుంచి రాజ్యసభకు గెలిచారు, కొద్ది రోజుల క్రితం తెరాసలో చేరారు)ల టర్మ్ పూర్తి కానుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి (టిడిపి, కేంద్రమంత్రి), జేడీ శీలం (కాంగ్రెస్), జైరామ్ రమేష్ (కాంగ్రెస్), నిర్మలా సీతారామన్ (బీజేపీ, కేంద్రమంత్రి)ల టర్మ్ పూర్తి కానుంది. కర్నాటక నుంచి రాజ్యసభకు వెళ్లిన, తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు టర్మ్ కూడా పూర్తి కానుంది.
విహెచ్, గుండు సుధారాణి, సుజనా, జేడీ శీలం, జైరామ్ రమేష్, నిర్మాలా, వెంకయ్య నాయుడులతో పాటు విజయ్ మాల్యా, అంబికా సోనీ తదితరుల 57 మంది టర్మ్ పూర్తి కానుంది.
ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల ద్వారా బీజేపీకి 5 రాజ్యసభ స్థానాలు పెరిగే అవకాశముంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో ఎవరెవరికి అవకాశం దక్కేనో?
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ, తెలంగాణలలో ఎవరెవరికి అవకాశాలు దక్కనున్నాయనే చర్చ సాగుతోంది. తెలంగాణలో రెండు తెరాసకు, ఏపీలో మూడు టిడిపి - బిజెపి మిత్రపక్షానికి, ఒకటి వైసిపికి దక్కే అవకాశముంది.
తెలంగాణలో కెసిఆర్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో చంద్రబాబు ఎవరికిస్తారనే ఆసక్తి నెలకొంది. మిత్రపక్షంలో భాగంగా రెండు టిడిపికి, ఒకటి బిజెపికి వెళ్తుంది.
కెప్టెన్ లక్ష్మీకాంత రావుకు దక్కేనా
టిఆర్ఎస్ నుంచి ఇద్దరికి రాజ్యసభ పదవులు దక్కనున్నాయి. కెసిఆర్ ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతోంది. కెప్టెన్ లక్ష్మీకాంత రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రాజ్యసభ ఎంపీగా ఉండగానే గుండు సుధారాణి తెరాసలో చేరారు. ఆమె కూడా మరోసారి ఆశలు పెట్టుకున్నారు. కానీ మరోసారి ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.
సుజనకు మరోసారి అవకాశం
కేంద్రమంత్రి సుజనా చౌదరికి మరోసారి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నందున.. చంద్రబాబు ఆయనకు మరో ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. మరో స్థానంలో కాపు నేతకు అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
మూడో సీటు బీజేపీకి
ఏపీలోని నాలుగు సీట్లలో ఒకటి వైసిపికి పోగా, రెండు సీట్లు టిడిపి తీసుకునే అవకాశాలున్నాయి. మరో సీటును చంద్రబాబు బీజేపీకి కేటాయించే అవకాశాలున్నాయి. నిర్మలా సీతారామన్కు మరోసారి అవకాశం ఇస్తారా లేక వెంకయ్య నాయుడును తెరపైకి తీసుకు వస్తారా, లేక మరొకరిని బీజేపీ తీసుకు వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
విజయ సాయి రెడ్డి
అసెంబ్లీలో బలాన్ని చూసుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యసభ గెలిచే అవకాశముంది. దానిని విజయ సాయి రెడ్డికి ఇవ్వాలని జగన్ ఇప్పటికే నిర్ణయించారు. అయితే, మరికొందరు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నాలుగో సీటుపై టిడిపి పోటీ
వైసిపి పోటీ చేయనున్న నాలుగో సీటుకు టిడిపి పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. వైసిపికి ఒక్క స్థానం కూడా దక్కకుండా చేయాలని టిడిపి భావిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో విప్ వర్తించదు. కాబట్టి టిడిపి అభ్యర్థిని నిలబెడితే వైసిపి ఎమ్మెల్యేలు కూడా టిడిపి అభ్యర్థికి ఓటు వేస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు.
మోత్కుపల్లి నర్సింహులు తదితరులకు ఇవ్వాలనే సూచనలు వస్తున్నాయి. అయితే, మోత్కుపల్లిని గవర్నర్ పదవిని కట్టబెడతారనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఆ అవకాశం ఇప్పటిదాకా రాలేదు. దీంతో, మోత్కుపల్లి కూడా రేసులో ఉన్నారు.
చంద్రబాబుకు 'తెలంగాణ' చిక్కు
ఇదిలా ఉండగా, ఏపీలో నాలుగు సీట్లలో ఒక సీటును తమకు ఇవ్వాలని తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబును కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో టిడిపి కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితిల్లో ఏపీ కోటాలోని రాజ్యసభకు ఒక తెలగాణ నేతను పంపించడం ద్వారా తెలంగాణను చంద్రబాబు వదులుకోలేదన్న సంకేతాలు ఇవ్వాలని అంటున్నారు. అయితే, ఏపీలోనే పోటాపోటీ ఉన్నందున ఇచ్చే పరిస్థితులు లేవు.