తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ వేడి: వీహెచ్ ఇంటిపై కన్నేసిన కేకే
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే రాజ్యసభ సీట్ల హడావుడి మొదైలంది. జులై 21 నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. తెలంగాణ నుంచి వి.హనుమంతరావు, గుండు సుధారాణి, ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, జైరాం రమేష్, జేడీ శీలం పదవీకాలం ముగియనుంది.
ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటుని తిరిగి మళ్లీ దక్కించుకునేందుకు రాజకీయనేతలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలనూ టీఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశం ఉంది.
కాగా టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన గుండు సుధారాణికి మళ్లీ రాజ్యసభ స్థానం దక్కే అవకాశాలు లేవని, ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని టీఆర్ఎస్ వర్గాలు సమాచారం. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విహెచ్ మరోమారు సీటుపై నమ్మకాన్ని పెట్టుకున్నారు.
ఇందుకోసం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ సెంటిమెంట్ అస్ర్తాన్ని ప్రయోగిస్తారని తెలిసింది. 2014లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేశవరావును నిలబెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆయనకు ఓటేసి గెలిపించిన సంగతి తెలిసిందే.
అప్పుడు కేకేకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినందున.. ఇప్పుడు తనకు టీఆర్ఎస్ మద్దతునివ్వాలని కేసిఆర్కు విజ్ఞప్తి చేయాలని విహెచ్ భావిస్తున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విహెచ్ కూడా ఎంతో కష్టపడ్డారు. ఇదే విషయాన్ని కూడా కేసీఆర్కు వివరిస్తానని సన్నిహితుల వద్ద చెబుతున్నారట.
అంతేకాదు టీఆర్ఎస్ మద్దతు పొందడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అంగీకరించినట్లు విహెచ్ తోటి నేతలవద్ద చెబుతున్నారు. మరోవైపు విహెచ్ ప్రస్తుతం నివసిస్తున్న 11 జన్పథ్ నివాసాన్ని ఆయన ఖాళీ చేసిన తర్వాత తనకే కేటాయించాలంటూ రాజ్యసభ సెక్రెటేరియెట్ను కేకే కోరినట్లు తెలిసింది.
ఆ ఇంటిని తనకు కేటాయిస్తే వాస్తుపరంగా చేయాల్సిన మార్పులపైనా కేకే అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విహెచ్ ఇంటికి వెళ్లి మరీ వాస్తును పరిశీలించారని సమాచారం. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు గాను ఒక స్థానం టీఆర్ఎస్లో చేరిన డి.శ్రీనివాస్కు ఖాయమంటున్నారు.
రెండో స్థానానికి మాత్రం చాలా మంది రేసులో ఉన్నారని తెలిసింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న వేణుగోపాలాచారి కూడా రాజ్యసభ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 21 మంది రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ జాబితాలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు.