రామోజీ ఫిల్మ్ సిటీపై నిలదీత, బీజేపీకి తెరాస ఆఫర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రాక ముందు రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లు పెట్టి దున్నిస్తామని తెరాస అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాడు చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం అన్నారు.
అయితే, మధ్యలో కల్పించుకున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యుడు బడ్జెట్తో సంబంధం లేని అంశాలను మాట్లాడుతున్నారన్నారు. సీఎం అన్నట్లుగా ఆధారాలు ఉంటే సభకు సమర్పించాలని అని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు అనని మాటలను ఆపాదించవదన్నారు. దీనికి ప్రతిగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గతంలో సీఎం అన్నారని ముక్త సరిగా చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చడం సరికాదన్నారు. ఇప్పుడున్న సచివాలయం స్థలంలోనే అధునాతన భవనాలను నిర్మించాలని, ఎర్రగడ్డలోనూ ఆసుపత్రి భవనాన్ని కొత్తది నిర్మించాలని సూచించారు. శాసనసభ్యులకు నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలను నిర్మించాలన్నారు.
బీజేపీకి తెరాస ఆఫర్
బడ్జెట్ పద్దుల పైన చర్చ సందర్భంగా బీజేపీ సభ్యులు చింతల రామచంద్రా రెడ్డికి అధికార తెరాస మంత్రులకు సోమవారం ఆసక్తికర సంభాషణ సాగింది. ఈ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదని విమర్శించారు. దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ.. మీరు కూడా మాలో చేరితే.. అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.