రామగుండం ప్రమాదంలో గోల్డ్ మిస్సింగ్: 2 కిలోల బంగారం దాచేసింది 108 సిబ్బందే
పెద్దపల్లి: రామగుండం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైన కేసులో నిందితులను గుర్తించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ బుధవారం మీడియాకు వెల్లడించారు.
మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా: మహమ్మారి బారిన 60శాతం మంది మంత్రులు
డివైడర్ ఢీకొనడంతో ప్రమాదం
రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వ్యాపారులైన సోదరులు కొత్త శ్రీనివాస్(55), రాంబాబు(45) మృతి చెందారు. ఈ ప్రమాదంలో గుమస్తా గుండా సంతోష్, కారు డ్రైవర్ డి సంతోష్ కు తీవ్రగాయాలయ్యాయి. రాజీవ్ రహదారిపై డివైడర్ను ఢీకొనడంతో వంద అడుగుల దూరంలోని సైన్ బోర్డు సిమెంట్ గద్దెను ఢీకొని కాల్వలో పడిపోయింది కారు.
కారులో 5 కిలోలకుపైగా బంగారం
తీవ్రగాయాలపాలైన రాంబాబు, గుండా సంతోష్, కారు డ్రైవర్ సంతోష్ లను 108 వాహనంలో గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల వెంట సుమారు 5 కిలోల 600 గ్రాముల బంగారం ఉందని బాధితుల కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే, 108 సిబ్బంది మాత్రం 3 కిలోల 300 గ్రాముల బంగారాన్ని ఎస్ఐ శైలజకు అప్పగించారు.
108 సిబ్బంది ఇచ్చింది 2 కిలోల బంగారమే..
ఈ క్రమంలో వ్యాపారుల వద్ద ఉన్న మరో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్లు బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు 24 గంటల్లోనే ఆ నిందితులను పట్టుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న 108 డ్రైవర్ గుండా లక్ష్మారెడ్డి, ఎమర్జెన్సీ టెక్నీషియన్ తాజుద్దీన్ 2 కిలోల 300 గ్రాముల బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించిన పోలీసులు, వారిద్దరినీ తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టారు.
బిల్లులు ఇచ్చిన తర్వాత బంగారం అప్పగింత
ప్రమాదం నుంచి ఎంతో మందిని కాపాడిన 108 సిబ్బంది అత్యాశతో చెడ్డ పేరు తెచ్చుకున్నారని సీపీ తెలిపారు. అత్యవసర సేవలు అందించే సిబ్బంది ఇలా అత్యాశకు పోకుండా మెరుగైన సేవలు అందించాలని హితవు పలికారు. కాగా, స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారానికి సంబంధించిన అన్ని బిల్లులను పరిశీలించిన తర్వాతే బాధితులకు అప్పగిస్తామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.