ప్రపంచ వారసత్వ గుర్తింపుకు చేరువలో రామప్ప .. నేడు, రేపు యునెస్కో బృందం పరిశీలన
యునెస్కో ముంగిట కాకతీయ కీర్తి పతాక రామప్ప దేవాలయం నిలిచింది. ప్రపంచ వారసత్వ గుర్తింపునకు అడుగు దూరంలో ఉంది రామప్ప దేవాలయం. అపురూప కట్టడంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప అణువణువునా ప్రత్యేకతలతో, అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో కాకతీయుల ఘనకీర్తిని చాటి చెబుతుంది. అలాంటి రామప్ప దేవాలయాన్ని నేడు, రేపు యునెస్కో ప్రతినిధుల బృందం పరిశీలించనుంది .
ప్రపంచ వారసత్వ సంపద గా యునెస్కో గుర్తింపు కోసం రామప్ప నామినేషన్
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఈసారి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఎనిమిది శతాబ్దాల చరిత్ర కలిగిన అపురూప కట్టడం, శిల్పి పేరుతోనే ప్రశస్తమైన కట్టడం, రాగాలు పలికే రాళ్లతో నిర్మించిన కట్టడం, పేరిణీ నృత్యానికి ప్రేరణగా నిలిచిన కట్టడం ములుగు జిల్లాలోని రామప్ప కట్టడం. కాకతీయ రాజుల చారిత్రక వైభవానికి ప్రతీకగా, అద్భుతమైన శిల్ప కళా సంపదకు పతాకగా, భక్తి , సాంకేతికతను మేళవించి నిర్మించిన అపురూప కట్టడం రామప్ప దేవాలయం.
రెండో సారి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం .. ఓరుగల్లుకు యునెస్కో ప్రతినిధి
ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప గుర్తింపు పొందడానికి 2017 లో ప్రయత్నం జరిగింది. అయితే అప్పుడు భారతదేశం నుండి రెండు నామినేషన్లు వెళ్లగా, రామప్ప కు సంబంధించిన వివరాలు సరిగా లేవని యునెస్కో తిరస్కరించింది. కానీ ఇప్పుడు భారతదేశం నుండి యునెస్కో కు కల్చరల్ కేటగిరీలో ఒక రామప్ప దేవాలయం మాత్రమే నామినేషన్ కు వెళ్ళింది. ఈ నేపథ్యంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి, రెండు రోజులపాటు రామప్ప ను పరిశీలించడానికి యునెస్కో ప్రతినిధి హషియానందన్ ఓరుగల్లు కు వచ్చారు. రెండు రోజులపాటు రామప్పలో పర్యటించి ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుర్తింపుకు కావలసిన అన్ని అర్హతలు పరిశీలించనున్నారు.
అద్భుత కట్టడంలో స్పెషల్ అట్రాక్షన్ గా మూడు అంశాలు
రామప్ప కట్టడం.... ఆద్యంతం అద్భుతమే.. శాండ్ బేస్డ్ టెక్నాలజీతో ఇసుక పునాదులపై నిర్మించిన కట్టడం . అంతేకాదు నీళ్లపై తేలియాడే బరువులేని ఇటుకలతో నిర్మించిన కట్టడం, ఒకే రాయిలో మూడు రంగులు కలిగి ఉండడం కూడా ప్రధానమైన అంశమే. ఇక ఈ మూడు రామప్పకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. కాకతీయులు నిర్మించిన కట్టడం గా, సుందర పర్యాటక ప్రాంతంగా, ప్రకృతి సౌందర్యంతో తులతూగుతూ, రామప్ప చెరువు తో అలరారుతూ ఎన్నో ప్రత్యేకతలతో నిలిచిన రామప్ప దేవాలయం ఈసారి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు సాధిస్తుందని తెలంగాణ వాసులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇంజినీరింగ్ అద్భుతం రామప్ప
1213 సంవత్సరంలో కాకతీయ రాజైన గణపతిదేవుని సేనాని రుద్రదేవుడు సారధ్యంలో నిర్మించబడిన రామప్ప దేవాలయం 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణమైంది. ప్రధాన ఆలయంతోపాటు 10 ఉపాలయాలు నిర్మాణం చేసిన శిల్పులు శిల్పాల మధ్య సూదిమొన మాత్రమే పట్టేంత అతి సన్నని రంధ్రాలను ఆలయ స్తంభాలపై చెక్కారు అంటే వారి ప్రతిభ ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. ఇక గర్భగుడిలో ఉండే శివలింగంపై ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని కాలాల యందు సూర్యకిరణాలు పడేలా నిర్మాణం చేశారు.
ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించే అవకాశాలే మెండు
ప్రపంచంలోనే నిర్మించిన శిల్పి పేరుతో ప్రసిద్ధమైన దేవాలయం ఒక్క రామప్ప మాత్రమే. అలాంటి రామప్ప దేవాలయాన్నియునెస్కో బృందం పరిశీలించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, ఈసారి రామప్ప ప్రత్యేకతలను యునెస్కో బృందానికి చూపించడానికి తగు ఏర్పాట్లు చేశారు. యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్ నర్తకి, ఆర్కిటెక్ట్ చూడామణి నందగోపాల్ ఆలయ ప్రత్యేకతలు పై ప్రత్యేక అధ్యయనం చేసి ఆ వివరాలను యునెస్కో కు అందజేశారు. 2019 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప ఆలయం పరిశీలనకు నామినేట్ అయింది. మొత్తానికి ఈసారి కచ్చితంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్పకు గుర్తింపు వస్తుందని తెలంగాణ వాసులు భావిస్తున్నారు.