ప్రపంచ వారసత్వ సంపదగా ‘రామప్ప’: యునెస్కో గుర్తింపు, 90కోట్లతో అభివృద్ధి
వరంగల్: ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం స్థానం దక్కించుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పను గుర్తించింది.
దీనిలో భాగంగా ప్రఖ్యాతిగాంచిన రామప్పతో పాటు ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పర్యాటక గ్రామం ఏర్పాటుకు స్థలం కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
రామప్ప సమీపంలో ఉన్న ములుగు మండలం ఇంచెర్ల గ్రామ శివారులోని రెండు ప్రభుత్వ స్థలాలను మంగళవారం ములుగు ఆర్డీవో మహేందర్జీ, తహసీల్దారు సత్యనారాయణ పరిశీలించారు. ఇక్కడున్న అన్ని పర్యాటక ప్రాంతాలకు అందుబాటులో, కేంద్ర బిందువుగా ఉండేలా సుమారు 15 ఎకరాల స్థలం కోసం అన్వేషిస్తున్నామని ఆర్డీవో తెలిపారు.
ఇంచెర్ల శివారులో రెండు స్థలాలను పరిశీలించామని, వీటిలో ఒకటి ఎంపిక చేస్తామని చెప్పారు.ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పను ఆధారం చేసుకొని సుమారు 10 నుంచి 15 ఎకరాల స్థలంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటక గ్రామాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సుమారు రూ.90 కోట్లు సమకూర్చనున్నాయి.
గ్రామంలో భారీ ఎత్తున సైన్బోర్డులు, అధునాతన టాయ్లెట్స్, భారీ రెస్టారెంట్, పర్యాటకులకు మార్గదర్శనం చేసే గైడ్లు, చరిత్రను వివరించే మ్యూజియం, ప్రదర్శనశాల, పార్కింగ్ స్థలం, పర్యాటకుల విడిదికి వసతిగృహాలు, చారిత్రక ప్రదేశాలు, పుస్తక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా, జిల్లాలోని ఇతర పర్యాటక ప్రదేశాలను కూడా అభివృద్ధి చేయనున్నారు.