'వారి తల నరికి చంపేవాడిని': రాందేవ్ బాబాపై హైద్రాబాద్లో కేసు
హైదరాబాద్: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పైన బుధవారం హైదరాబాదులో కేసు నమోదయింది. మెడికల్ విద్యార్థి మహ్మద్ బిన్ ఒమర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్చౌక్ పోలీసులు రాందేవ్ పైన ఐపీసీ 295ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల భారత్ మాతాకీ జై నినాదం విషయంలో బాబా రాందేవ్ ఓ వర్గం మనోభావాలను కించపరుస్తూ వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాందేవ్ బాబా పైన చర్యలు తీసుకోవాలని అతను పేర్కొన్నాడు.
కాగా, 'భారత్ మాతాకీ జై' అనకుంటే తాను వందలాంది మందిని తలనరికి చంపేసేవాడినని అని ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. హర్యానాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన సద్భావన సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగంలో భారత్ మాతాకీ జై అనాలని ఎక్కడా లేదు కాబట్టి దాని మీద ఉన్న గౌరవంతో ఆ పని చెయ్యడం లేదని ఆయన అన్నారు. 'భారత్ మాతాకీ జై' అనడం తనకిష్టం లేదని కొంత మంది బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని అందుకు వారు సిగ్గుపడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ మాతృ దేశాన్ని గౌరవించాలని ఆయన సూచించారు.
రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అప్పుడే తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా దీనిపై ఏ ఒక్కరూ పౌరుల దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తారు. 'నా గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదాన్ని చేయను. 'భారత్ మాతాకీ జై' అని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు' అని అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.