2050 నాటికి దేశంలో ఎవరూ రోగాలతో బాధపడకూడదు: రామ్దేవ్ బాబా
నిజామాబాద్: 2050 నాటికి దేశంలో ఎవరూ కూడ రోగాలతో బాధపడకూడదనేది తన ఉద్దేశ్యమని ప్రముఖ యోగ గురువు రామ్దేవ్ బాబా అభిప్రాయపడ్డారు. రోగాల నుండి విముక్తిని పొందేందుకే తాను యోగాను 9 ఏళ్ళ వయస్సులోనే నేర్చుకొన్నానని ఆయన చెప్పారు. నిజామాబాద్లో జరిగే మూడు రోజుల ఉచిత యోగ ధ్యాన శిభిరంలో పాల్గొనాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ కవిత, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావును రామ్దేవ్బాబా ఆహ్వనించారు.
మూడు రోజుల పాటు నిజామాబాద్లో యోగ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో యోగ నిర్వహణకు సంబంధించి రామ్దేవ్ బాబా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు నిజామాబాద్కు వచ్చిన రామ్దేవ్ బాబా మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 10వ తేది నుండి మూడు రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాలు జరగనున్నాయి.
తనలో శ్వాస ఉన్నంత వరకు తాను యోగ చేస్తానని రామ్దేవ్ చెప్పారు.పతంజలి వస్తువులను విక్రయించటం ద్వారా వచ్చే లాభాలను ఆరోగ్యం, చదువు కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఇందులో తనతో పాటు పతంజలి బాలకృష్ణ ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా పనిచేస్తున్నామన్నారు.
సమాజంలో దళితులు కూడ భాగమన్నారు. వారిపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని రామ్దేవ్ బాబా అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజులుగా దేశంలో దళితులు తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేస్తున్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగరాదన్నారు. దీనిని సాకుగా కొందరు నేతలు, ఇతరులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దన్నారు. . లక్ష మంది విద్యార్థులకు యోగాపై శిక్షణ ఇచ్చేందుకు ఢిల్లీలో యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు.