ఎస్సై రమేష్ మృతి: పోస్టుమార్టంలో సంచలన విషయాలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైన ప్రాథమిక అంశాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎస్ఐ రమేష్ మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నాయని ప్రాథమిక నివేదిక తెలియజేస్తోంది. అదే విధంగా తొడలు, అరికాళ్లపై రక్తం కమిలిన గుర్తులు ఉన్నాయని నివేదికలో చెప్పారు.
కర్రలతో కొట్టినట్టు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది. తుది నివేదికను సీల్డ్కవర్లో పోలీసు ఉన్నతాధికారులకు అందిస్తామని వైద్యులు తెలిపారు. తన భర్తను హింసించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని రమేష్ భార్య గీత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో మంత్రి మహేందర్రెడ్డి, ఇద్దరు ఇన్స్పెక్టర్ల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు రమేష్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీఐడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేర్పల్లిపెద్దతండాలో ఎస్ఐ రమేష్ బంధువులు ఆందోళనకు దిగారు. రమేష్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని డిమాండ్ చేశారు. కాగా ఎస్ఐ రమేష్ మృతదేహానికి ఎస్పీ దుగ్గల్ నివాళులర్పించారు. ఎస్ఐ రమేష్ ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎస్పీ వివరించారు.
రమేష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని నల్లగొండ ఎస్పీ దుగ్గల్ చెప్పారు. రమేష్ నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చి ఎస్సై అయిన తీరును ఆయన వివరించారు. రమేష్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, దీంతో కేసును పూర్తి స్థాయిలో సిఐడి దర్యాప్తు చేస్తుందని ఆయన చెప్పారు.