కేసీఆర్ హామీ, టిడిపికి రాథోడ్ షాక్: రంగంలోకి రేవంత్ రెడ్డి, నేతల్లో ఆందోళన
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వర రావులు అప్రమత్తమయ్యారు.
అదిలాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వర రావు, వేం నరేందర్ రెడ్డిలు అప్రమత్తమయ్యారు.
రమేష్ రాథోడ్ మార్పు ప్రచారంపై చర్చ టిటిడి నేతలు చర్చించుకున్నారని తెలుస్తోంది. రేవంత్ సహా ఇతర నేతలు ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించారని తెలుస్తోంది.
ఈ నెల 29వ తేదీన రమేష్ రాథోడ్ చిన్న కుమారుడి వివాహం జరగనుంది. ఆయన సీఎం కేసీఆర్కు శుభలేఖ అందించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగింది.
జిల్లాలో బలమైన నాయకుడు
జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న రమేష్ రాథోడ్కు ప్రత్యేక అనుచర వర్గం ఉంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, జిల్లాపరిషత్ అధ్యక్షుడిగా, ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. టిడిపికి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆయననే పెద్ద దిక్కు. దీంతోనే రాష్ట్రస్థాయిలోని టీఆర్ఎస్ నేతలు ఆయనతో జరిపిన చర్చలు సఫలమైనట్లు చెబుతున్నారు.
రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్ హామీ
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మధ్యవర్తిత్వం వహించగా, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇవ్వడంతో తెరాసలోకి వచ్చేందుకు రమేష్ అంగీకరించారని అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉట్నూర్ లేదా ఖానాపూర్ నుంచి 2019లో పోటీ చేయవచ్చు. లేదా అదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి కూడా పోటీకి అవకాశమిస్తానని కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది.
ఇంత చేస్తున్నా... టిడిపిలో ఆందోళన
ఓ వైపు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు మినీ మహానాడు, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రమేష్ రాథోడ్, నేడు ఆర్ కృష్ణయ్య పార్టీ మార్పు ప్రచారం నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
వరుసగా షాకులు
తెలంగాణలో టిడిపి దాదాపు కనుమరుగయిందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నిన్నటి వరకు తెరాస, ఇప్పుడు బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. టిడిపి నేతలు తెరాస వైపు, ఆ తర్వాత బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్యల పేర్లు కూడా పార్టీ మారే వారి జాబితాలో వినిపించాయి. కానీ వారు వాటిని కొట్టి పారేశారు.
ప్రధానంగా తెలంగాణకు టిడిపిలో పెద్దగా అవకాశాలు లేవని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది టిడిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిస్తే 12 మంది తెరాసలో చేరారు. సండ్ర, రేవంత్ రెడ్డిలు టిడిపిలో ఉన్నారు.