రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్కు ఆభరణం: మోడీకీ కెసిఆర్ కితాబు
హైదరాబాద్: భాగ్యనగరానికి రామోజీ ఫిలిం సిటీ ఓ ఆభరణం వంటిదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు చెప్పారు. రామోజీ ఫిలిమ్ సిటీలో 27వ అఖిల భారత నిర్మాణదారుల సమాఖ్య సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడారు.
ప్రస్తుతం సమయం త్యాగాల కోసం కాదని, దేశ నిర్మాణం కోసమని చెప్పారు. రియల్ ఎస్టేట్స్ అభివృద్ధి చెందడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు. నిర్మాణ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారుతోందన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
నిర్మాణ రంగ సమస్యలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానన్నారని చెప్పారు. ప్రధాని మోడీ వాటిని తప్పక పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రగతిశీల ప్రధాని అని కితాబిచ్చారు. అవసరానికి ల్యాండ్ పూలింగ్ తప్పదన్నారు.
అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్ స్వప్నం సాకారం కావాలన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆధునిక, శక్తిమంతమైన భారత్ నిర్మాణంలో బిల్డర్లు భాగస్వాములే అన్నారు.
అన్ని రంగాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. నిర్మాణ రంగ దారులను ప్రధాని మోడీ వద్దకు తీసుకు వెళ్తానని, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. భారతదేశానికి ఉజ్వల భవిష్యత్ ఉందన్నరు. ఆధునిక, శక్తిమంత భారత్ నిర్మాణంలో బిల్లర్లు భాగస్వాములేనని చెప్పారు.
అన్ని రంగాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ స్వప్నం సాకారమయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోని అన్ని ఆర్థిక సంస్థలు భారత్ను వెలుగురేఖగా అభివర్ణిస్తున్నాయన్నారు.
కాగా, మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1200 మందికి పైగా క్లాస్-1 గుత్తేదారులు, టర్కీ నుంచి పలువురు నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారు. నిర్మాణ రంగంలో ఇబ్బందులు, ప్రభుత్వ సాయం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.