బీజేపి బంపర్ ఆఫర్.. తిరస్కరించిన రామోజీ రావు..
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మీడియా టైకూన్ రామోజీ రావుకు బీజేపి మంచి అవకాశాన్ని ఆఫర్ చేసింది. కాని రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో పసిగట్టగలిగే రామోజీరావు బీజెపి ఇచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న రామోజీని తమవైపు తిప్పుకుంటే రాబోవు రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయని బీజేపి భావించింది. తెలుగు రాష్ట్రాల్లో రామోజీ రావు అంతర్గతంగా బల పరిచే పార్టీ తప్పక విజయం సాదిస్తుందనే నమ్మకం ప్రతి పార్టీలో ఉండడంతో ఎన్నికల సమయంలో రామోజీ రావు సహకారాన్ని తీసుకునేందుకు రాజకీయ పార్టీలు వెంపర్లాడుతుంటాయి. అందులో భాగంగానే బీజేపి, జాతీయ హోదాలో రామోజీరావుకు మంచి ఆఫర్ ఇచ్చేందుకు రెఢీ అయ్యింది. కాని బీజేపి చేసిన ఆఫర్ ను రామోజీ రావు తిరస్కరించినట్టు సమాచారం.. ఇంతకి బీజెపి ఇచ్చిన ఆఫర్ ఏంటి..? రామోజీ రావు ఎందుకు తిరస్కరించారు..?? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
అందుకే సమావేశం.. కాదన్న మీడియా దిగ్గజం..
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రభావాన్ని మార్చగల శక్తి ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీ రావుకు ఉంది. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీల ద్రుష్టి రామోజీరావు పై కేంద్రీకరించడం జరుగుతుంది. 2009లో రామోజీ రావు కు చెందిన మీడియా సంస్థలు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దత్తు తెలపడంతో కాస్తో కూస్తో ప్రభావం చూపించగలిగింది. ప్రస్తుత తెలుగు రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకత్వం తో పాటు, కార్యక్రమాలకు పెద్ద యెత్తున ప్రాచూర్యం కలగజేసే మీడియా సహకారం కూడా అవసరం. ఇందులో భాగంగానే బీజెపి జాతీయ అద్యక్షుడు అమీత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా పార్టీ నాయకుల కన్నా ముందుగా నేరుగా ఫల్మ్ సిటీ వెళ్లి రామోజీరావుతో సమావేశమయ్యారు.
Recommended Video
ప్రాదాన్యత సంతరించుకున్న రామోజీరావు, అమీత్ షా భేటీ..
రామోజీరావుతో సమావేశమైన అమీత్ షా సమకాలీన రాజకీయాలపై సమగ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణతో పాటు, ఏపిలో రాజకీయ సమీకరణాల గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణ బీజెపి పార్టీకి తమలాంటి పెద్దల అండదండలు అవసరమనే ప్రతిపాదలను రామోజీ రావు ముందుంచినట్టు తెలుస్తోంది. రామోజీ రావు వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజెపి కి మద్దత్తు తెలపాల్సిందిగా అభ్యర్ధించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామోజీరావు అమీత్ ప్రతిపాదనకు అంగీకరిస్తే కేంద్ర స్థాయిలో సముచిత స్థానం కల్పిస్తామనే అంశం గురించి కూడా చర్చించారు.
తెలుగురాష్ట్రాల్లో పాగా వేసి దక్షిణభారతంలో ఉనికిని చాటుకోవాలన్నది బీజెపి ప్రణాళిక..
తెలంగాణాతో పాటు ఏపిలో బీజెపిని రామోజీరావు బలపరిస్తే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయనేది బీజెపి ప్రణాళిక. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు ప్రజాక్షేత్రంలో పటుకుబడి ఉన్న వ్యక్తులకు బీజెపి ఆహ్వానం పలుకుతోంది. భారతీయ జనతా పార్టీకి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతినిద్యం ఉన్నప్పటికి దక్షిణ భారత దేశం లో చెప్పుకునే ప్రాతినిద్యం లేదని బీజేపి భావిస్తోంది. అందుకోసం తెలుగురాష్ట్రాల్లో పాగా వేసి దక్షిణభారతంలో తమ ఉనికికి శ్రీకారం చుట్టాలని వ్యూహం రచిస్తోంది. అంతే కాకుండా రామోజీ రావు వ్యక్తుల సహకారంతో ఈ సారి సరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రభావం చూపాలని పట్టుదలతో ఉంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయుకులను కాకుండా ప్రముఖ పారిశ్రామిక వేత్తల కోసం వేట మొదలు పెట్టింది.
నామినేటెడ్ పదవి వేరు, ఎన్నికల వాతావరణం వేరు..
తెలంగాణతో పాటు ఏపిలో బీజెపికి మద్దత్తు తెలిపే అంశంలో రామోజీతో స్పష్టత తీసుకున్నారు అమీత్ షా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఏపిలో తమ పార్టీకి మద్దత్తు తెలిపితే అందుకు తగ్గ ప్రతిపలం ఉంటుందని కూడా రామోజీరావుతో అమీత్ షా తెలిపినట్టు తెలుస్తోంది. కేంద్రం ప్రతిపాదించబోయే రాజ్యసభ సభ్యులలో రామోజీరావుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అమీత్ షా స్పష్టం చేసినట్టు తెలిసింది. అందుకోసం ఈ నెల 10న ప్రకటించాల్సిన నామినేట్ రాజ్యసభ సభ్యులను రామోజీరావును సంప్రదించిన మరుసటి రోజున సంప్రదంచడం జరిగింది. కాగా రామోజీ రావుకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చేందుకు పార్టీ సిద్దంగా ఉందని స్వయంగా అమీత్ షా చెప్పినప్పటికి, రామోజీ రావు సున్నితంగా తిరస్కరించారు. కళా కారుడు రఘునాథ్ మోహ పాత్ర, క్లాసికల్ డాన్సర్ సోనాల్ మన్ సింగ్, మాజీ ఎంపీ రామ్ శకల్, ప్రముఖ రచయిత రేకేష్ సింహా లలో ఒకరిని తప్పించి రామోజీకి అవకాశం ఇవ్వాలని బీజెపి భావించింది. ఎన్నికల వాతావరణానికి, రాజ్యసభ సభ్యత్వానికి సంబందం లేదని, సమయం వచ్చినప్పుడు మీడియా పరంగా సహకారం అందించే అంశం పై స్పష్టత ఇస్తానని హామి ఇచ్చినట్టు తెలిసింది. మొత్తానికి రాబోవు ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకుని బీజెపి ఇచ్చిన అవకాశాన్ని రామోజీ రావు సున్నితంగా తిరస్కరించినట్టు చర్చ జరుగుతోంది.