అందుకే సస్పెండ్ చేశారా? కేసీఆర్ వెంట తెలంగాణ ద్రోహులు: రాములు నాయక్ కంటతడి
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై సస్పెన్షన్కు ఆ పార్టీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని.. అదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారైందని ఆరోపించారు.
టీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన అనంతరం రాములు నాయక్ సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. తాను గిరిజనుడైనందున వల్లే కనీసం షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు.
కేసీఆర్ వెంట తెలంగాణ ద్రోహులు..
గిరిజనులకు రిజర్వేషన్ కోరినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? అని రాముల్ నాయక్ నిలదీశారు. ప్రగతి భవన్లో కేసీఆర్ వెంబడి ఉండే తెలంగాణ ద్రోహులు.. ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్లో ఉన్నారని రాములు విమర్శించారు. ఒక దశలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. గిరిజనులకు భూమి ఇస్తామన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
హామీలిచ్చారు కానీ..
దళితులకు కూడా భూమి ఇవ్వమంటే ఇవ్వట్లేదని అన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీ ఇప్పుడేమైందని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. గిరిజన ఐఏఎస్లకు కీలక పదవులు కూడా ఇవ్వలేదన్నారు.
డీఎస్, కొండాకు అలా.. నాకు మాత్రం.. హెచ్చరిక
గిరిజనులంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిన్నచూపేనని అన్నారు. డీఎస్సీ నిర్వహించమంటే పట్టించుకోలేదని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని అన్నారు. డీ శ్రీనివాస్, కొండా సురేఖను సస్పెండ్ చేయాలని అందరూ కోరితే చేయలేదు గానీ, షోకాజు నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
త్వరలో భవిష్యత్ కార్యాచరణ
గిరిజన నాయకులు, మేధావులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రాములు నాయక్ను సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కుంతియాను రాములు కలిశారనే విషయం తెలియడంతోనే టీఆర్ఎస్ ఆయనపై వేటువేసింది.