అభిషేక్ బచ్చన్తో డిన్నర్: మెరిసిన రానా, భార్యతో కలిసి రామ్ చరణ్
హైదరాబాద్: సామాజిక బాధ్యతలో భాగంగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్తో టాలీవుడ్ నటులు రానా, రామ్ చరణ్ జత కలిశారు. సెలబ్రిటీలు సమాజసేవలో భాగంగా అప్పుడప్పుడు ఛారిటీ సంస్ధలకు తమ వంతు సాయం చేస్తుంటారు.
సమాజ సేవ చేసేందుకు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఎప్పుడూ ముందుంటారు. అంతేకాదు ''నేను సైతం'' అంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ ఛారిటీ డిన్నర్కు టాలీవుడ్ నటులు రామ్ చరణ్, రానా సహకరించారని అభిషేక్ బచ్చన్ సన్నిహితులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనాథ పిల్లల చదువుల కోసం అభిషేక్ బచ్చన్ నిధులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సింగపూర్, హైదరాబాద్లలో ఛారిటీ డిన్నర్లను నిర్వహించారు. నగరంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫలక్నుమా ప్యాలెస్లో ఈ డిన్నర్ను ఏర్పాటు చేశారు.
ఈ డిన్నర్కు నటులు రామ్ చరణ్, రానా హాజరై అనాథ బాలల కోసం తమ వంతు బాధ్యతగా విరాళాలను ఇచ్చారు. ఇలా అభిషేక్ బచ్చన్ నిర్వహించిన ఈ ఛారిటీ డిన్నర్ ద్వారా సుమారు 30 వేల మంది అనాథ బాలల చదువుకు అవసరమైన నిధులు సమకూరాయి.
మూడు రాష్ట్రాల్లో దాదాపు నాలుగు లక్షల మందిని ఆదుకుంటున్న ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి గతంలో కూడా అభిషేక్ బచ్చన్ నిధులు సేకరించారు. సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్లను నిర్వహించి ఆ సంస్థకు నిధులు సమకూర్చారు. కబడ్డీ టీమ్ మ్యాచ్ల టిక్కెట్లపై కొంత శాతాన్ని ఆ సంస్థకు విరాళంగా ఇచ్చారు.