రంగనాథ్ వంటగదిలో ఉరేసుకున్నారా?: ఇంట్లో పోలీసు సోదాలు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ ఉరేసుకుని మరణించారనే ప్రచారం సాగుతోంది. ఆయన హైదరాబాదులో కవాడీగుడాలో గల ఇంటిలోని వంటగదిలో ఉరేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి రంగనాథ్ ఉంటున్నది తన పెద్ద కూతురు నివాసమని తెలుస్తోంది. ఆయన ఒంటరిగానే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆయన సంతానం బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతికి సంబంధించిన సమాచారాన్ని వారికి చేరవేసినట్లు తెలుస్తోంది.
ఆయన భౌతిక కాయాన్ని గాంధీనగర్లోని నర్మదా ఆస్పత్రిలో ఉంచారు. బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారు. రంగనాథ్ గత కొంతకాలంగా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడం లేదని కూడా చెబుతున్నారు.
రంగనాథ్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. 300లకు పైగా చిత్రాల్లో నటించిన రంగనాథ్ సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఆయన ఓ కవిత్వం పుస్తకాన్ని కూడా వెలువరించారు. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్.
మొగుడ్స్ పెళ్లామ్స్ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. రంగనాథ్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.