ఎంసెట్ 2: కేసీఆర్ మదిలో ఏముంది?, ప్రభుత్వానికి విద్యార్ధుల హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ 2 పేపర్ లీకేజి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంసెట్ 2 పేపర్ లీకైందని సీఐడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి, ఎంసెట్ 3ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గురువారం సచివాలయానికి చేరుకుని ఎంసెట్ 2ను రద్దు చేయొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళన కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసెట్ 2 పేపర్ లీకేజీ కాదని, ఇది డబ్బున్నవాళ్లు చేసిన స్కామ్ అని, లీకేజి అయిన పేపర్లు సామాన్య ప్రజలకు అందలేదని, కాబట్టి ఎంసెట్ 2 పరీక్షను రద్దు చేయొద్దని పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
అంతక ముందు తెలంగాణ తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా సచివాలయంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు ఎంసెట్ 2 లీకేజి అనేది డబ్బు ఉన్నవాళ్లు ఇతర రాష్ర్టాలకు పోయి చేసిన స్కామ్గా అభివర్ణించారు.
స్కామ్లోని నిందితులను పట్టుకోవడానికి ఆధునాతన టెక్నాలజీ ఉందని, సమయం సరిపోకపోతే మరో 20 రోజులు టైమ్ తీసుకుని నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఎంసెట్ నిర్వహించడం వల్ల విద్యార్ధులు ఒత్తిడికి లోనవుతారని వారు పేర్కొన్నారు.
విద్యార్ధులు, తల్లిదండ్రులు విజ్ఞప్తులు పట్టించుకోకుండా ఎంసెట్ 3ని నిర్వహిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టుని ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎంసెట్ 2 పేపర్ రద్దుపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అధికారింగా నిర్ణయం తీసుకోనుంది.
ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ వర్సిటీలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై అటు విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, వైస్ ఛాన్సలర్లు హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం ఎంసెట్ 2 పరీక్షపై సీఎం అధికారిక ప్రకటన చేయనున్నారు.