ఏడాదిగా అత్యాచారం..మరణానికి ముందు బాలిక వాంగ్మూలం..ఆ అనాధాశ్రమం సీజ్
అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై ఏడాది కాలంగా మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని ఓ ప్రైవేటు అనాధాశ్రమంలో బాలికపై నిర్వాహకుడి అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఇలాంటి అనాధాశ్రమాలలో తనిఖీలు చేపట్టాలని హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.
అమీన్ పూర్ అనాధాశ్రమాన్ని సీజ్ చేసిన అధికారులు
అమీన్ పూర్ లో అనాధాశ్రమం లో మైనర్ బాలికపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన నేపథ్యంలో అధికారులు ఆశ్రమాన్ని సీజ్ చేశారు. అందులో ఉన్న 70 మంది బాలికలను ఇతర సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఈ కేసు దర్యాప్తు మహిళా భద్రతా విభాగం ఏడిజి పర్యవేక్షణలో జరుగుతుంది. లాక్ డౌన్ సమయం లో కూడా ఈ ఆశ్రమంలో 29 మంది పిల్లలకు ప్రవేశాలు కల్పించినట్లుగా గుర్తించారు అధికారులు. వీరికి సంగారెడ్డి కి చెందిన సీడబ్ల్యూసీ సభ్యులు అత్యంత సన్నిహితంగా ఉండటంతో, వారి సహకారం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.
కేసు వివరాలు వెల్లడించిన పటాన్ చెరువు డీఎస్పీ
ఈ కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించిన పటాన్ చెరువు డీఎస్పీ రాజేశ్వరరావు బాలిక ఇచ్చిన వాంగ్మూలం మేరకు నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా కేసు నమోదు చేశామని,ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.బాలిక మూత్రసంబంధమైన సమస్యతో బాధపడుతోందని, ఆ సమస్యకు శస్త్రచికిత్స చేయించామని, తలకు చిన్న గాయం అయితే పసుపు అద్దామని అనాధాశ్రమం నిర్వాహకులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటు అనాధాశ్రమం నిర్వాహకులు మాత్రమే కాకుండా, బాలిక బంధువులు కూడా ఆమెను వేధించారని దర్యాప్తులో వెల్లడైంది.
బాలికను వేధించిన బంధువులపై కేసు నమోదు
కరోనా వ్యాప్తికి కారణంగా మార్చి 21న బాలికను బంధువులు తమ ఇంటికి తీసుకు వెళ్లారు. నాలుగు నెలల తర్వాత మరలా ఆశ్రమంలో చేర్చుకోవాలి అని కోరారు. అయితే కరోనా నిబంధనల పేరుతో తిరిగి చేర్చుకోవడానికి నిరాకరించారు ఆశ్రమ నిర్వాహకులు. అప్పటికే బాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. అయినప్పటికీ బాలికను బంధువులు కూడా వేధించారు. ఈ విషయాలన్నీ సీడబ్ల్యూసీ నిర్వహించిన విచారణలో తెలియడంతో బాలిక బంధువులపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.