దారుణం: యువతిపై రేప్, వీడియోతీసి.. సోషల్ మీడియాలో పెట్టి.. బ్లాక్మెయిల్ చేసి..
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగిన దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడడమేకాకుండా రేప్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోను మరికొందరు యువకులు డౌన్లోడ్ చేసుకుని బాధితురాలిని బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా ప్రయోజనం లేకపోవడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు రేప్ చేసిన ఇద్దరు యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కట్టెల కోసం గుట్టకు వెళితే ఇద్దరు యువకులు కూల్డ్రింక్ తాగించారని, ఆ తరువాత సోయిలేకుండా పడిపోయిన తనపై లైంగిక దాడి జరిపారని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
మెలుకువ వచ్చి చూసేసరికి తనపై అఘాయిత్యం చేస్తూ కనిపించారని, వీడియో కూడా తీస్తుంటే తాను అడ్డుకున్నానని, తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.
అనంతరం ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం పెద్దపల్లి ఆసుపత్రికి తరలించిన పోలీసులు, నిందితులైన కదంపూర్కు చెందిన బండి శ్రీనివాస్, పెద్ది నగేష్లను అదుపులోకి తీసుకున్నారు.
వారి సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా సేకరిస్తున్నారు. లైంగిక దాడి వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది ఎవరు? మళ్లీ దాన్ని డౌన్లోడ్ చేసుకుని బ్లాక్ మెయిల్ కు పాల్పడింది ఎవరు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.