ఖమ్మంలో దారుణం: 'అమ్మ రమ్మంటోంది' అని చెప్పి వివాహితపై అత్యాచారం..
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో మతిస్థిమితం లేని ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 9వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం విషయం బయటకు చెబితే చంపేస్తామని నిందితులు యువతిని బెదిరించారు. కూతురు నీరసంగా ఉంటుండటంతో తల్లి ఆమెను ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది.
పోలీసుల కథనం ప్రకారం.. తనికెళ్లకు చెందిన ఓ వివాహితకు కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. భర్త వదిలేయడంతో నాలుగేళ్ల కుమారుడితో కలిసి పుట్టింటిలోనే ఉంటోంది. స్థానికంగా కూలీ పనులకు వెళ్తుంటుంది. ఇదే క్రమంలో మార్చి 9న బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన భంటు యల్లారావు 'మీ అమ్మ నిన్ను తీసుకురమ్మంటోంది' అని చెప్పి ఆమెను తన వెంట తీసుకెళ్లాడు.
ఇంటికి తీసుకెళ్లి అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న మేకల రామకృష్ణ అనే యువకుడు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించారు. ఏప్రిల్ 17న ఆమె మెడికల్ షాపు వద్దకు వెళ్లగా.. యల్లారావు అక్కడ ఆమెతో గొడవపడ్డాడు.
'ఇంట్లో చెప్తే చంపేస్తా..' అంటూ ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో ఆ వివాహితను నెట్టివేయగా.. కిందపడ్డ ఆమెకు నుదుటిపై గాయమైంది. ఆపై అతనే ఆమెను ఇంటికి తీసుకొచ్చి ప్రథమ చికిత్స కూడా అందించాడు. ఇటీవల ఆమె మరింత నీరసంగా ఉంటుండటంతో తల్లిదండ్రులు ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం దెబ్బతిన్నట్టు చెప్పారు.
ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత తల్లి ఆమెను ఆరా తీయగా.. అప్పుడు అసలు విషయం బయటపడింది. యల్లారావు, రామకృష్ణలు తనపై అత్యాచారం జరిపారని తెలిపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.