కూతురిపై రేప్: తండ్రికి పదిన్నరేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా
హైదరాబాద్: కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి పదిన్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట పూల్బాగ్ ప్రాంతంలో నివసించే మహ్మద్ సలీం(43)కి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
2011 ఏప్రిల్ 28న సాయంత్రం సలీం తన చిన్న కుమార్తె(9)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
కాగా, సోమవారం కేసును ఐదో అడిషనల్ ఎంఎస్జె కోర్టు జడ్జి విచారించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పదిన్నరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 500 జరిమానా విధించింది.
భార్య మృతికి కారణమైన ఐదేళ్ల జైలు, జరిమానా
భార్య మృతికి కారణమైన భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఐదో అదనపు సెషన్స్ (మహిళా కోర్టు) జడ్జి జి. వెంకట కృష్ణంరాజు తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన రంగప్రసాద్, హనుమాయమ్మ దంపతులు. తమ కూతురుతోపాటు వీరు కొంతకాలంగా హిమాయత్నగర్లో ఉంటున్నారు.
మద్యానికి బానిసైన రంగప్రసాద్ భార్యను వేధించడంతో ఆమె 2010 జనవరి, 23న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై నారాయణగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఆమె మృతికి రంగప్రసాద్ కారణమని తేలడంతో కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది.