రసమయి సంచలనం: 'ఎమ్మెల్యే' అయినందువల్లే గద్దర్కు అసూయ
తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న అసూయతో గద్దర్ తనతో మాట్లాడటమే మానేశారని, ఇదే కారణంతో అందెశ్రీ సైతం రెండేళ్లుగా మాట్లాడలేదని రసమయి బాలకిషన్ పేర్కొనడం గమనార్హం.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈమధ్య తరుచుగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. ఆమధ్య కరీంనగర్ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కిన ఆయన.. తాజాగా ప్రజా యుద్దనౌక గద్దర్, ప్రజా వాగ్గేయకారుడు అందేశ్రీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న అసూయతో గద్దర్ తనతో మాట్లాడటమే మానేశారని, ఇదే కారణంతో అందెశ్రీ సైతం రెండేళ్లుగా మాట్లాడలేదని రసమయి బాలకిషన్ పేర్కొనడం గమనార్హం. శుక్రవారం నాడు రవీంద్రభారతిలో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్బంగా రసమయి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈర్ష్యా ద్వేషాలను పక్కనబెట్టి దళితులంతా తమ హక్కుల కోసం పోరాడాలని రసమయి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు సుంపాక దేవయ్య మాదిగ, ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక గౌరవాధ్యక్షుడు ఎం.విజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రామలక్ష్మణ్, ఉత్సవాల కమిటీ చైర్మన్ నరేంద్ర మాదిగ, దళిత నాయకుడు బేబీ రాజు సహా పలువురు పాల్గొన్నారు.