షాక్: బ్రేక్ఫాస్ట్లో ఎలుక, 18మంది విద్యార్థులకు అస్వస్థత
మెదక్: వంట సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పలువురు పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం మునిపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారంగా కిచిడీ వడ్డించారు.
అయితే, ఏడో తరగతి చదువుతున్న అరుణ్ గిన్నెలోని ఆహారంలో పూర్తిగా ఉడికిన ఎలుక రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వండేవారు ఎలుకను తీసేసి అదే కిచిడీని పిల్లలందరికీ వడ్డించేశారు. దీంతో కొందరు విద్యార్థులకు వాంతులైన ఘటన సంగారెడ్డిజిల్లా మునిపల్లిమండలం లింగంపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
కిచిడీ తిన్న వెంటనే 18 మందికి వాంతులు అవుతున్న విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు అధికారులు, వైద్యులకు సమాచారం అందించారు. మునిపల్లి మండల వైద్యాధికారులు వినయ్కుమార్, ప్రతాప్ పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
తహసీల్దార్ పద్మావతి పాఠశాలను సందర్శించి, వండుతున్నఅన్నాన్ని పరిశీలించారు. కాగా, అందులో మట్టిరాళ్లు, దుమ్ము ఉండటంతో గుత్తేదారుడు, వంటమనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అంటూ వార్డెన్ అశోక్, సిబ్బందిపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరారు.