పిల్లల పేరు మీద రేషన్ కార్డులు..తెలంగాణాలో ఆహార భద్రతా కార్డుల జారీలో డొల్లతనం !!
వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా భోజనం దొరుకుతుంది అన్న చందంగా రేషన్ కార్డులు జారీ చేసే అధికారులు కాస్త సహకరిస్తే చిన్న పిల్లల పేరు మీద కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు అని నిరూపించారు నిజామాబాద్ జిల్లాలో గ్రామస్తులు . తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆహారభద్రత కార్డుల జారీ కొనసాగుతున్న క్రమంలో నిజామాబాద్ జిల్లాలో చిన్న పిల్లల పేరు మీద రేషన్ కార్డులు తీసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఐదేళ్ల పిల్లలకు కూడా రేషన్ కార్డుల జారీ
నిజామాబాద్ జిల్లాలో ఐదేళ్ల పిల్లలకు కూడా వాళ్ల పేరు మీద రేషన్ కార్డులు మంజూరు చేశారు అధికారులు. నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో 22 మంది పేరు మీద మంజూరైన ఆహార భద్రత కార్డులు అన్ని చిన్నపిల్లల పేరు మీదే మంజూరు కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. గ్రామంలో మంజూరైన 65 రేషన్ కార్డులలో నిబంధనలకు విరుద్ధంగా 22 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. కార్లు, ఆస్తులు ఉంటే కార్డు రాదన్న భయంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల పేరు మీద అప్లికేషన్ లు పెట్టారు.
స్థానిక నాయకుల పలుకుబడితో రికార్డులు తారుమారు .. పిల్లల పేరుమీద రేషన్ కార్డులు
ఇక ఈ అప్లికేషన్ ను విచారించిన అధికారులు నాట్ ఎలిజిబుల్ అని, వీరికి రేషన్ కార్డు మంజూరు చేయొద్దని ఎంట్రీ కూడా చేశారు. అయినా సరే స్థానిక అధికార పార్టీ నాయకులు తమకున్న పలుకుబడితో, మండల స్థాయిలో రికార్డులను తారుమారు చేసి చిన్నారుల పేరు పైన ఆహారభద్రత కార్డులు మంజూరు అయ్యేలా చేశారు. దీంతో ఇప్పుడు 22 మంది పిల్లల పేరుతో ఆహార భద్రత కార్డులు మంజూరు అయ్యాయి. రేషన్ కార్డుల జారీలో అవకతవకలకు పాల్పడిన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
రేషన్ కార్డుల జారీలో బయటపడిన డొల్లతనం
చిన్న పిల్లల పేరు మీద రేషన్ కార్డులు జారీ చేసిన అధికారులతో పాటుగా, చిన్న పిల్లల పేరు మీద రేషన్ కార్డుకి అప్లై చేసిన తల్లిదండ్రులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో అధికారులను ఆ ఆహార భద్రతా కార్డులను రద్దు చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
చాలా కాలం నిరీక్షణ తర్వాత జారీ అవుతున్న రేషన్ కార్డులు .. కార్డుల జారీలో అవకతవకలు
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మళ్లీ ఇప్పుడు కొనసాగించాలని సీఎం కేసీఆర్ భావించడంతో సీఎం కేసీఆర్ సూచనల మేరకు జూలై 26 నుండి 31 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు అందరికీ ఆగస్టు నెల నుంచి రేషన్ బియ్యం ఇవ్వనున్నారు. రేషన్ కార్డుల విషయంలో పారదర్శకంగా ప్రక్రియను పూర్తిచేసి, అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అయితే ఇందులో అవకతవకలు చోటు చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి