నిత్యావసరాలా?.. నగదా? ఏది మంచిదో అధ్యయనం చేయండి: సీఎం కేసీఆర్ ఆదేశం
రేషన్ దుకాణాల ద్వారా బియ్యం అందించడం ఉత్తమమా? లేదంటే లబ్ధిదారులకు నగదు ఇవ్వడం మంచిదా? అనే విషయమై అధ్యయనం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా బియ్యం అందించడం ఉత్తమమా? లేదంటే లబ్ధిదారులకు నగదు ఇవ్వడం మంచిదా? అనే విషయమై అధ్యయనం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
సమ్మె చేస్తామంటూ రేషన్ డీలర్లు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యుహంపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్ లో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు.
రూ.వేల కోట్లు ఖర్చుచేసి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం రావడంలేదని, బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ సరుకుల పంపిణీలో అక్రమాలు, అవకతవకలను తొలగించేందుకు అనువైన విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు సంపూర్ణ ప్రయోజనం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బియ్యం అక్రమ రవాణా మాఫియా ఏర్పడిందని, ఈ పరిస్థితి పోవాలని సూచించారు. రేషన్ డీలర్ల సమ్మె నోటీసుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. సమ్మె ఆలోచన విరమించకపోతే నగదు నేరుగా లబ్ధిదారులకు అందేలా చూడాలని భావిస్తున్నామని చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పౌర సరఫరాల సంస్థ కమిషనర్ సీవీ ఆనంద్, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, రామకృష్ణా రావు, వాకాటి కరుణ, శాంత కుమారి, స్మితా సబర్వాల్ , భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.