వాట్ ఏ గలీజ్ దందా.. లిక్కర్ ప్రొడక్షన్లో రేషన్ బియ్యం..!
వనపర్తి : రూపాయి రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రూపాయి బియ్యం అంగడి సరుకులా మారింది. రేషన్ షాపుల నుంచి లబ్ధిదారుల ఇళ్లకు చేరకముందే దళారుల పాలవుతోంది. ఆ బియ్యం కాస్తా ఎక్కడికి చేరుతున్నాయో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. లిక్కర్ తాగడానికి రేషన్ బియ్యం అమ్ముకోవడం లేదు జనాలు.. కానీ, కొందరు లిక్కర్ తయారీకి ఈ బియ్యం కొనుక్కోవడం గమనార్హం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యధేచ్ఛగా సాగుతున్న రూపాయి రేషన్ బియ్యం దందా అడ్డూ అదుపులేకుండా పోతోంది. వ్యయప్రయాసలకు ఓర్చి ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం అందిస్తుంటే.. కొందరు దళారులు వాటిని అమ్మడం కొనడం దందాగా మలచుకున్నారు.
లిక్కర్ ఫ్యాక్టరీకి రూపాయి కిలో బియ్యం
వనపర్తి జిల్లాలో రూపాయికే కిలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం లిక్కర్ ఫ్యాక్టరీకి చేరుతోంది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా అందించే రూపాయికే కిలో బియ్యం లిక్కర్ తయారీలో వినియోగిస్తున్నారనే విషయం విస్మయం కలిగిస్తోంది. బడుగు, బలహీన వర్గాల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ బియ్యం.. గలీజు దందాలో ముడిసరుకుగా మారడం చర్చానీయాంశమైంది.
ఎస్పీవై రెడ్డి, వైఎస్ఆర్.. అదే కోవలో రవీందర్ సింగ్.. కరీంనగర్లో రూపాయికే అంత్యక్రియలు
దళారుల పాలిట వరం.. లిక్కర్లో ప్రొడక్షన్లో రేషన్ బియ్యం
వనపర్తి జిల్లాలో రేషన్ బియ్యం దళారుల పాలిట వరంగా మారుతోంది. లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తూ బయట ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కిలో 5 రూపాయల నుంచి మొదలు అంతకన్నా కాస్తా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దాన్నే వృత్తిలా మార్చుకుంటున్నారు. అలా లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని పెబ్బేరు సమీపంలోని ఓ లిక్కర్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు.
క్వింటాళ్ల కొద్దీ రేషన్ బియ్యం లిక్కర్ ఫ్యాక్టరీకి చేరుతుండటం గమనార్హం. బియ్యంతో లిక్కర్ తయారుచేస్తున్నారనే పక్కా సమాచారంతో ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ మొక్కజొన్నలు, బియ్యంతో లిక్కర్ ప్రొడక్షన్ జరుగుతుండటం చూసి విస్మయానికి గురయ్యారు. వందల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ షాపుల దగ్గరే బియ్యం మాయం.. ఆటోల్లో తరలింపు
రేషన్ బియ్యం లిక్కర్ తయారీలో వినియోగిస్తున్నారనే విషయం బయటకు పొక్కడంతో దళారులు రూట్ మార్చారు. ఇదివరకు రూపాయి కిలో రేషన్ బియ్యం తీసుకునే లబ్ధిదారుల ఇళ్లల్లో నుంచి సేకరించేవారు. ఇప్పుడు ఏకంగా రేషన్ షాపుల దగ్గరే పడిగాపులు గాస్తున్నారు. అలా వేలు ముద్ర వేసి లబ్ధిదారులు బియ్యం తీసుకోగానే.. ఇలా వెంట తెచ్చుకున్న ఆటోల్లోకి ఎక్కించేస్తున్నారు. అనంతరం లిక్కర్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు.
లబ్ధిదారుల నుంచి కొన్న బియ్యం ఇదివరకు హోటళ్లకు సప్లై చేసేవారనే ఆరోపణలున్నాయి. లిక్కర్ ఫ్యాక్టరీతో డీల్ కుదిరాక, వాళ్లకు పెద్దమొత్తంలో బియ్యం అవసరం కావడం.. రేటు కూడా గిట్టుబాటు కావడంతో అక్కడికే ఎక్కువగా తరలిస్తున్నారట. అయితే అధికారులకు ఈ విషయమంతా తెలిసికూడా మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలకు లెక్కలేదు. అప్పుడప్పుడూ నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నా.. అక్రమ రవాణా కట్టడికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.