రేషన్ షాపుల్లో ఇక అన్నీ సేవలు.. టీ వాలెట్ ద్వారా సులభతరం
Recommended Video
హైదరాబాద్ : రేషన్ షాపుల్లో ఇక నెలానెలా సరుకులు తీసుకోవడమే కాదు.. పలు రకాల సేవలు కూడా పొందే ఛాన్సుంది. ఇప్పటివరకు నిత్యవసర వస్తువులైన బియ్యం, చక్కెర లాంటి వస్తువులు అందిస్తున్న రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతా అనుకున్నట్లు సవ్యంగా జరిగితే టీ వాలెట్ ద్వారా పలు సేవల్ని సులభతరం చేయనున్నారు అధికారులు. ఈ సేవ కేంద్రాల మాదిరి రకరకాల సేవలు రేషన్ షాపుల ద్వారా అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే రేషన్ దుకాణాల డీలర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
వారం రోజులాయే.. కిడ్నాప్ కేసులో పోలీసులకు సవాల్.. నిందితుడి సమాచారం ఇస్తే లక్ష నజారానా..!
నిత్యవసర సరుకులే కాదు.. ఇకపై అన్నీ సేవలు
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేషన్ షాపుల ద్వారా నిత్యవసరాల సరుకుల పంపిణీ జరుగుతోంది. బియ్యం, చక్కెర లాంటి తదితర వస్తువులను ప్రజలకు అందిస్తున్నారు.నెలనెలా ఒకటో తేదీ నుంచి మొదలు 15వ తేదీ వరకు ఆయా ప్రాంతాలను బట్టి సరుకుల పంపిణీ జరుగుతోంది. అయితే రేషన్ షాపుల్లో అవకతవకలు జరగకుండా బ్రేక్ వేయడానికి ఈ పాస్ విధానం అమలు చేస్తోంది ప్రభుత్వం. ఆ క్రమంలో బయో మెట్రిక్ విధానం అమల్లోకి తెచ్చింది. రేషన్ కార్డులో పొందుపరిచిన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్లి ఆ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించింది.
అంతేకాదు ఉద్యోగరీత్యా లేదా జీవనపోరాటంలో భాగంగా హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లినవారు ప్రతినెలా వారి గ్రామానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా చేసింది ప్రభుత్వం. వారు ఉన్న చోటే సరుకులు తీసుకునే సౌకర్యం కల్పించింది. ఈ పాస్ విధానం అందుబాటులోకి రావడంతో లబ్దిదారులు మాత్రమే సరుకులు తీసుకునే ఫెసిలిటీ ఉంది. ఆ క్రమంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా మారిన రేషన్ దుకాణాల్లో ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
టీ వాలెట్ ద్వారా సేవలు.. బిల్లుల చెల్లింపు సులభతరం
రేషన్ షాపుల్లో ఇప్పటివరకు కేవలం సరుకుల పంపిణీ మాత్రమే జరుగుతోంది. అయితే ఈ సేవ కేంద్రాల్లో ఏవైతే సేవలు లభిస్తున్నాయో అలాంటి సేవలు జనాలకు అందుబాటులోకి తెచ్చే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ మేరకు రేషన్ దుకాణాల్లో ఈ సేవ కేంద్రాల్లో ఏవైతే సేవలు అందుతున్నాయో అలాంటి సేవలు ఇక్కడ కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రేషన్ దుకాణాల్లో ఇకపై కరెంటు బిల్లులు, ఇంటిపన్ను, ఆస్తి పన్ను, నగదు బదిలీ, మొబైల్ రీచార్జి తదితర సేవలు అందించేందుకు టీ- వాలెట్ ద్వారా సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రేషన్ షాపుల్లో ఇలాంటి సేవలు త్వరలో అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతో రేషన్ డీలర్ల ఆదాయం కూడా పెరగనుంది. రేషన్ షాపుల్లో ఇలాంటి సేవలు అందించడం ద్వారా వివిధ పనులు ఒకే గొడుగు కింద చేసుకునేలా ప్రజలకు ఈజీ కానుంది.
రేషన్ డీలర్లకు ట్రైనింగ్.. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్
టీ వాలెట్ ద్వారా రేషన్ కార్డు ఉన్నవారికి ఎలాంటి సేవలు అందించాలనే దానిపై డీలర్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఆ మేరకు షెడ్యూల్స్ కూడా తయారుచేస్తున్నట్లు సమాచారం. ఇక డీలర్లకు శిక్షణ పూర్తయిన తర్వాత అక్టోబర్ నెల నుంచి రేషన్ దుకాణాల్లో టీ వాలెట్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రేషన్ షాపులు సాధారణంగా ఏ పది పదిహేను రోజులో తెరిచి ఉండేవి. ఇక టీ వాలెట్ సేవలు ప్రారంభమైతే నెలరోజులు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయి.