రవళి ఆరోగ్య పరిస్థితి విషమం .. వెంటిలేటర్ పై ప్రాణాల కోసం పోరాడుతున్న రవళి
ప్రేమోన్మాది సాయి అన్వేష్ దాడిలో గాయపడిన రవళి పరిస్థితి విషమంగా ఉంది. హన్మకొండలోని నయిం నగర్ లో పెట్రోల్ దాడి కి గురైన రవళి తీవ్రంగా గాయపడింది .70 శాతం కాలిన గాయాలతో ఉన్న రవళి ని మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.
రవళి పరిస్థితి విషమం .. దాడిపై విద్యార్థుల రాస్తారోకో ... స్పందించిన మంత్రి ఈటెల
సాయి అన్వేష్ పెట్రోల్ తో దాడి చేసిన వెంటనే రవళి ని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ రవళి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెకు చికిత్స చేయడానికి సరైన సౌకర్యాలు లేని కారణంగా రవళిని హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రవళి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమని, వైద్యానికి శరీరం సహకరిస్తున్నప్పటికీ, ఆమె ఇంకా ప్రమాదం నుండి బయటపడలేదని వైద్యులు చెప్తున్నారు.
మరోవైపు నిందితుడు సాయి అన్వేష్ ను రిమాండ్ కు తరలించారు. ఘటనకు పాల్పడిన సాయి అన్వేష్ మామునూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోయాడు. అతని పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టు కు తరలించారు. సాయి అన్వేష్ కి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.