బస్తీ మే సవాల్ : దమ్ముంటే బరిలోకి దిగు, కేసీఆర్కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల వేసవిలో మరింత హీట్ పుట్టిస్తోన్నాయి. సీఎం కేసీఆర్పై మరోసారి ఫైరయ్యారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. దమ్ము, ధైర్యం ఉంటే మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలువాలని సవాల్ విసిరారు. అంతేకాని తనపై రియల్టర్లు, బ్రోకర్లను పోటీకి నిలుపొద్దని తేల్చిచెప్పారు.
ఫెడరల్ ఫ్రంట్ను ఆశీర్వదించండి : సమస్యే లేకుండా చేస్తానని కేసీఆర్ భరోసా
కౌరవులు వంద .. పాండవులు ఐదుగురే ..
ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతలు చేయిచ్చి కారెక్కవడంతో రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కౌరవులే వంద .. పాండవులు ఐదుగురేనని పేర్కొన్నారు. అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షం ఉండాలి కానీ ... కేసీఆర్ రాజ్యంలో విపక్షం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బకాసురుడిలా మారి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడడాన్ని తప్పుపట్టారు.
చివరి రక్తం చిందేవరకు పోరాడుతా
రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం రాజ్యం పోవాలంటే కార్యకర్తలు విల్లు ఎక్కుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సైన్యాధ్యక్షుడిలా ముందుండి పోరాడుతానని స్పష్టంచేశారు. మెడి తెగి చివరి రక్తం చిందేవరకు కేసీఆర్పై పోరాడుతానని .. ఆయనకు రాజకీయంగా సమాధి కట్టేవరకు ఊరుకోనని తేల్చిచెప్పారు.
నిరుద్యోగులే అండ దండ
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులే ఓటేస్తేనే రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రేవంత్రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికలను సుధీర్రెడ్డి కోసం ప్రచారం చేస్తే .. ఆయనిచ్చిన కానుక ఇది అని మండిపడ్డారు. తన ఇంటికొచ్చి మల్కాజిగిరిలో పోటీ చేయమన్నది సుధీర్రెడ్డి కాదా అని ప్రశ్నించారు.
సబితా ఇదీ నీకు తగునా ?
కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డి కుటుంబాన్ని చెరదీసిందని గుర్తుచేశారు. పార్టీ మంత్రిని చేసి, కీలక బాధ్యతలు అప్పగిస్తే ... ఆమె చేసిందేంటి అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీచేయనని తనతో చెప్పిన .. సబితా చివరికి టీఆర్ఎస్లోకి వెళ్లడం న్యాయమా అని ప్రశ్నించారాయన.