జర్నలిస్టులారా పిడికిలి బిగించండి, ధనికస్వామ్యంపై పోరాడుదాం : టీవీ9 రవిప్రకాశ్
హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ గళమెత్తారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే గాక మోజో టీవీని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ధనిక స్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. జర్నలిస్టులారా పిడికిలి బిగించి పోరాడుదామని, ప్రజలు కూడా మద్దతు తెలుపాలని కోరారు రవిప్రకాశ్.
బెదిరించి .. భయపెట్టి ...
మోజో టీవీని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రవిప్రకాశ్ ఆరోపించారు. ఇప్పటికే టీవీ 9 గ్రూపు సహా ఇతర చానెళ్లను చెప్పుచేతల్లో ఉంచుకున్నారని మండిపడ్డారు. మీకు ఇంకెన్నీ టీవీ చానెళ్లు కావాలని అలంద మీడియా యాజమాన్యాన్ని ప్రశ్నించారు. టీవీ 9 సంస్థలోకి దొడ్డిదారిన వచ్చి తనను బయటకు పంపడమే కాకుండా ..తన స్నేహితులు పెట్టుకున్న మోజో టీవీని ఆక్రమించే ప్రయత్నం సరికాదని మండిపడ్డారు. ఇకనైనా వారిపై పోరాటానికి సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. ఇందుకోసం మద్దతివ్వాలని జర్నలిస్టులు, ప్రజలను కోరారు. జర్నలిస్టులారా ఏకం కండి, పిడికిలి బిగించి ధనికస్వామ్యంపై పోరాడుదాం, నాతో పాటు మీరు వెన్నుదన్నుగా నిలువండి .. ప్రజలు కూడా మద్దతివ్వాలి అని వీడియోలో కోరారు రవిప్రకాశ్.
బలవంతంగా లాక్కొనే ప్రయత్నం ...
పేద రైతుల నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారుల ఒత్తిడితో భూములను ఎలా ఆక్రమిస్తారో రాష్ట్రంలో మీడియాను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు రవిప్రకాశ్. హైదరాబాద్కు చెందిన అంబరీశ్ పూరి కొంతమంది పోలీసులతో కలిసి మోజో టీవీని ఆక్రమించే పన్నాగం పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని బెదింరిచి, పాస్ పోర్టు లాక్కొని, భయపెట్టి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఫైరయ్యారు. మోజో టీవీని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న అంబరీష్ పూరి ఒక్క రూపాయి కూడా పాత యాజమాన్యానికి ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. సత్యాన్ని చంపేస్తున్నారు. నీచంగా ప్రవర్తిస్తూ .. దుర్మార్గపు చేష్టలతో విర్రవీగిపోతున్నారని మండిపడ్డారు రవిప్రకాశ్. లేఖితనంపై ఎలుగెత్తి పోరాడుదామని పిలుపునిచ్చారు. దుర్మార్గానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. పత్రికా స్వేచ్చ కోసం, సత్యం బతికేందుకు జర్నలిస్టు పిడికిలి బిగించి గొంతెత్తి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఎట్టకేలకు విచారణకు ...
టీవీ 9లో ఫోర్జరీ, డేటా కేసులపై రవిప్రకాశ్పై అలంద మీడియాకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవిప్రకాశ్ వర్సెస్ అలంద మీడియా మధ్య వార్ ప్రారంభమైంది. దీంతో పోలీసులు సీఆర్పీసీ 160 సెక్షన్ల కింద రెండుసార్లు, 41 ఏ కింద ఒకసారి నోటీసులు జారీచేశారు. ఈ కేసుల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు. రెండుసార్లు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. హైకోర్టులో తేల్చుకోవాలని సూచించడంతో .. గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిన్న సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరయ్యారు రవిప్రకాశ్. వివిధ అంశాలపై దాదాపు 5 గంటలపాటు విచారించారు పోలీసులు. తర్వాత మీడియాతో మాట్లాడిన రవిప్రకాశ్ ధనికస్వాములపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.