తెలంగాణా సర్కార్ కావాలనే వేధింపులకు గురి చేస్తుందని సంచలన ఆరోపణలు చేసిన రవి ప్రకాష్
Recommended Video
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ తెలంగాణా సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. తనను తెలంగాణా సర్కార్ కావాలనే వేధింపులకు గురి చేస్తుంది ఆయన పేర్కొన్నారు. తాజాగా, ముందస్తు బెయిల్ కోసం మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించారని, ప్రభుత్వం దురుద్దేశంతో తనను వేధిస్తుందని ఆయన తన పిటిషన్లో నివేదించారు. అంతే కాదు పలు సంచలన ఆరోపణలు చేశారు.
తనపై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్న రవి ప్రకాష్ ఆ సంస్థలో నిధుల వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక నిధుల వ్యవహారమే తెలంగాణా సర్కార్ తనను వేధించటానికి కారణం అని ఆయన చెప్పినట్టు సమాచారం . రవి ప్రకాష్ నిధుల అక్రమాలను బయటపెట్టినందుకే తనను పోలీసులు తప్పుడు కేసుల్లో ఇరికించి, అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొనట్టు తెలుస్తుంది . కాబట్టి తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని రవిప్రకాశ్ పిటిషన్లో కోర్టును కోరారు . రవిప్రకాశ్ తరఫున దిల్జీత్సింగ్ అహ్లూవాలియా వాదనలు వినిపించారు. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై జస్టిస్ గండికోట శ్రీదేవి సోమవారం విచారణ చేపట్టారు.
ఇక రవిప్రకాష్ తరపు న్యాయవాది తన క్లయింట్ ను 40 గంటలపాటు ప్రశ్నించారని, ఇంకా వారికి ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వారు అనుకున్నది చెప్పేదాకా వేధిస్తూనే ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు రవి ప్రకాష్ పై పెట్టిన కేసులు అన్నీ తప్పుడు కేసులని , అసలు వ్యవహారం అది కాదని కొత్త వాదన వినిపించారు . అంతేకాదు, ఏదైనా కేసుల్లో ఎఫ్ఐఆర్ను ఎస్హెచ్వో నమోదు చేయాల్సి ఉండగా ఈ కేసులో మాత్రం స్వయంగా ఏసీపీ రంగంలోకి దిగడాన్నిబట్టి చూస్తే అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. న్యాయస్థానం షరతులకు కట్టుబడి ఉంటారని, బెయిలు మంజూరు చేయాలని న్యాయవాది ఆహ్లూవాలియా కోరారు. ఇక ఈ నేపధ్యంలో మరి కాసేపట్లో ఆయన బెయిల్ పిటీషన్ పై నిర్ణయం రానుంది.