రవి ప్రకాష్ మెడకు మరో ఉచ్చు ..టీవీ9 లోగోను అమ్మేసి, యాడ్స్ సొంత మొబైల్ టీవీకి బదిలీ చేశాడని మరో కేసు
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది .రవి ప్రకాష్ మీద మరో కేసు నమోదైంది. చానల్ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత మొబైల్ టీవీ , వెబ్చానల్ కు దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్ డైరెక్టర్ కౌశిక్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
రవి ప్రకాశ్ వివాదంలో 'ఆ ఛానల్' ఛైర్మన్ పాత్ర..! ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..!!
టీవీ 9 లోగోను అమ్మేశారని, యాడ్స్ వేరే చానల్ కు మళ్ళించారని ఫిర్యాదు చేసిన కౌశిక్ రావు
రవిప్రకాశ్పై కంపెనీ ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులు నమోదు అయ్యాయనే విషయం తెలిసిందే . ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. కౌశిక్రావు హైదరాబాదు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తాజాగా ఈ కేసు నమోదైంది. రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, హరికిరణ్ చేరెడ్డి కలిసి రవి ప్రకాష్ సొంత మొబైల్ టీవీకి టీవీ9 లోగోలను యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు కేవలం రూ.99 వేలకు అమ్మేశారని , టీవీ 9 కు వచ్చే యాడ్స్ ను కూడా సదరు మొబైల్ టీవీ కి మళ్ళించారని ఫిర్యాదు చేశారు.
కోట్ల విలువ చేసే లోగోను లక్ష రూపాయలకే అమ్మేశారని రవిప్రకాష్ తోపాటు మరో ఇద్దరిపై ఫిర్యాదు
కోట్ల రూపాయల విలువచేసే లోగోలను అక్రమంగా, దురుద్దేశపూర్వకంగా అమ్మేశారు రవి ప్రకాష్ అని వారు ఆరోపిస్తున్నారు. టీవీ9 కు వచ్చే యాడ్స్ ను సైతం రవి ప్రకాష్ పెట్టిన మొబైల్ టీవీ కి మళ్ళించి కంపెనీవాటాదారులకు నష్టం కలిగించే విధంగా రవిప్రకాశ్ బదిలీ చేశారని కౌశిక్రావు రవి ప్రకాష్ పై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులో 2018 మే 22న కుదిరిన మౌఖిక ఒప్పందం మేరకు వీటిని అమ్ముతున్నామంటూ 2018 డిసెంబరు 31న డీడ్ ద్వారా వాటిని రాసిచ్చేశారు రవి ప్రకాష్ . లోగోలు అమ్మినందుకు టీవీ9 యాజమాన్య సంస్థ ఏబీసీపీఎల్కు డబ్బులు అందాలి. అందుకు సాక్ష్యంగా 2019 జనవరి 22న 99,000 రూపాయలను నెక్ట్స్ ఇండియా నుంచి ఏబీసీపీఎల్కు డబ్బులను బదిలీ చేశారు. నిధుల బదిలీకి కారణాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అదర్ రిపెయిర్స్ అండ్ మెయింటెనెన్స్గా పేర్కొన్నారు. అదే విషయాన్ని 2019 ఫిబ్రవరి 28న కంపెనీ బుక్స్లో అదే కారణంతో నమోదు చేశారని పేర్కొన్నారు.
మెజార్టీ వాటాదారులను మోసం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్న కౌశిక్ రావు
కోట్ల రూపాయల విలువచేసే లోగోలను అమ్మే నిర్ణయాలను తీసుకున్నపుడు మెజారిటీ వాటాదారులకు సమాచారం ఇవ్వాలనే నిబంధనను పాటించలేదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన కేసులతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న రవి ప్రకాష్ పై ఇప్పుడు మరో కేసు నమోదు అయ్యింది. టీవీ 9 లోగోను మెజార్టీ వాటాదారులకు తెలీకుండా అమ్మేశారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది.