ఏపీ నుంచి 12మంది, టి నుంచి ఇద్దరేనా?: ‘హైకోర్టు’పై రవిశంకర్ రిప్లై
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన కేంద్రం పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సమస్య పరిష్కారం దిశగా కేంద్రం కృషి చేస్తోందని ఆయన వివరించారు. మంగళవారం రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి పై విధంగా స్పందించారు.
నియామకాల్లో అన్యాయం: కేకే
హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన బిల్లుపై రాజ్యసభలో మంగళవారం చర్చలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ కే కేశవరావు మాట్లాడుతూ... 'ఉమ్మడి హైకోర్టులో 58:42 ప్రకారం నియామకాలు జరపాలి. కానీ ఇటీవల 14 మందిని నియమించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మంది ఉంటే, తెలంగాణ నుంచి ఇద్దరినే తీసుకున్నారు' అని పేర్కొన్నారు.
ఉమ్మడి హైకోర్టు ఇటీవల పలువురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి జాబితాను రూపొందించిందని, దానికి అనుమతి కూడా లభించిందని గుర్తు చేశారు. ఉమ్మడి హైకోర్టులోని మొత్తం 61 పోస్టుల్లో కేవలం 19 మంది మాత్రమే తెలంగాణవారని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా హైకోర్టు కొనసాగుతున్నప్పటికీ న్యాయమూర్తుల నియామకంలో తెలంగాణకు తగిన ప్రాధాన్యం లభించడంలేదన్నారు.
వెంటనే హైకోర్టులను ఏర్పాటుచేయాలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల రాష్ట్రాలకు ప్రత్యేకంగా హైకోర్టులను ఏర్పాటు చేయాలని టిఆర్ఎస్ ఎంపీ వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్సభలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. విభజన చట్టంలోని సెక్షన్ 31(1) ప్రకారం ఉభయ రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఉండాలన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని తక్షణమే హైకోర్టును విభజించాలన్నారు.
సెక్షన్ 80(2) ప్రకారం తెలంగాణ, ఏపీ సిబ్బంది నియామకాలకు సంబంధించి సలహా కమిటీ ఉండాలనీ... సబార్డినేట్ జ్యూడీషియల్ అధికారుల నియామకాల నిమిత్తం సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని న్యాయశాఖ మంత్రికి ఆయన విజ్ఞప్తిచేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31(1) ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులు ఉండాలని వ్యాఖ్యానించిన ఎంపీ బీ వినోద్కుమార్.. వెంటనే కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్సభలో మంగళవారం 377వ నిబంధన కింద ఈ అంశాన్ని లేవనెత్తిన వినోద్కుమార్.. పునర్వవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31(2) ప్రకారం రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ఈ విధమైన నోటిఫికేషన్ విడుదల చేయాలంటే కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి చొరవ తీసుకుని ఈ అంశాన్ని సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.