బెల్లి లలిత హత్యకు కారణమదే, అందులో నా పాత్ర లేదు: రిటైర్డ్ ఎఎస్పీ రవీందర్ రెడ్డి సంచలనం
హైదరాబాద్: ముషీరాబాద్ జైల్లో ఉన్న సమయంలోనే మాజీ మావోయిస్టు నయీంను పోలీస్ ఇన్ఫార్మర్గా మార్చిన ఘటనలో తన పాత్ర లేదని ఈ విషయంలో ఆ సమయంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు చేసి ఉండొచ్చని భువనగిరిలో డిఎస్పీగా పనిచేసి రిటైరైన రవీందరెడ్డి అభిప్రాయపడ్డారు. బెల్లి లలిత హత్య కేసు విచారణ సందర్భంగా తాను ఒక్కసారి నయీంను విచారించినట్టు రవీందరెడ్డి చెప్పారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిద హోదాల్లో పనిచేసిన ఎఎస్పీగా రిటైరైన రవీందర్ రెడ్డి తన ఉద్యోగ నిర్వహణలో చోటు చేసుకొన్న ఘటనలను ఓ చానెల్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ విచారణ ముందు కూడ రవీందర్ రెడ్డి హజరయ్యారు.సిట్ విచారణకు హజరుకావడం తనకు బాధ కల్గించిందన్నారు.
నయీం పోలీస్ ఇన్ఫార్మర్గా మార్చడంలో తన పాత్ర లేదు
మాజీ మావోయిస్టు నయీంను పోలీస్ ఇన్ఫార్మర్గా మార్చడంలో తాను కీలకం వ్యవహరించాననే విషయాన్ని రిటైర్డ్ డిఎస్పీ రవీందరెడ్డి ఖండించారు. బెల్లి లలిత హత్య తర్వాత ఆ కేసు విచారణ సందర్భంగానే ముషీరాబాద్ జైల్లో ఉన్న నయీంను కలుసుకొన్నట్టు రవీందర్ రెడ్డి చెప్పారు. కానీ, అంతవరకు నయీం వ్యాస్ హత్య కేసులో నిందితుడిగా మాత్రమే తెలుసునని చెప్పారు.ఆ సమయంలో శాఖమూరి అప్పారావు, రవిలను కూడ కలిసి మాట్లాడినట్టు రవీందర్ రెడ్డి చెప్పారు.ఆ సమయంలో నయీంను తాను తొలిసారిగా కలుసుకొన్నట్టు రవీందర్ రెడ్డి చెప్పారు. బెల్లి లలిత కేసు విషయమై నయీంను విచారించిన సమయంలో లలితను తన సోదరుడు అలీ చంపేసి ఉంటారని నయీం చెప్పారని రవీందర్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు.
ఆ ప్లాన్ తెలిసే బెల్లి లలితను చంపేశాడా
బెల్లి లలిత, మాజీ మావోయిస్టు నయీం మద్య సంబంధాలు ఉండేవని విచారణలో తేలిందన్నారు. వీరిద్దరూ కూడ ఒకానొక సమయంలో వివాహం చేసుకోవాలని భావించారని రవీందర్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొన్నారు. కానీ, నయీంను బెల్లి లలిత ట్రాప్ చేసిందనే అనుమానంతో ఆమెను నయీం జైలులో ఉండే హత్య చేయించాడని రవీందర్ రెడ్డి చెప్పారు.ఈ కేసు విషయంలో అప్పటి మంత్రి మాధవరెడ్డితో పాటు తనపై కూడ ప్రచారం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
మావోయిస్టులను ధైర్యంగా ఎదుర్కొన్నా
తాను పనిచేసిన అన్ని ప్రాంతాల్లో మావోయిస్టులను ధైర్యంగా ఎదుర్కొన్నానని రవీందర్ రెడ్డి చెప్పారు. మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో పనిచేసిన సమయాల్లో మావోయిస్టులతో అనేక కాల్పుల ఘటన నుండి తప్పించుకొన్నానని రవీందర్ రెడ్డి చెప్పారు. అంతేకాదు కామారెడ్డిలో పనిచేసే సమయంలో స్కూల్ ఆవరణలోనే మావోయిస్టులు తనపై కాల్పులు జరిపారని ఆ ఘటనలో తాను తప్పించుకొన్నానని చెప్పారు.అనేక ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు చనిపోయారని ఆయన చెప్పారు. పోలీసు కుటుంబాల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసినట్టు రవీందర్ రెడ్డి చెప్పారు. కొన్ని సమయాల్లో గన్ మెన్, డ్రైవర్తోనే మావోయిస్టులను వెంబడించినట్టు రవీందర్ రెడ్డి చెప్పారు.
నక్సలైట్ల లారీని వెంటాడాను
యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్పై మావోయిస్టులు దాడి చేసి ఆయుధాలు తీసుకెళ్ళిన ఘటన తెలిసిన వెంటనే తాను గన్ మెన్, డ్రైవర్తో గుట్ట పోలీస్ స్టేషన్ వైపుకు వెళ్ళినట్టు చెప్పారు. తాను అక్కడికి వెళ్ళిన సమయంలో పోలీస్ స్టేషన్లో ఇంకా దుమ్ము లేస్తోందని చెప్పారు. అప్పుడే మావోయిస్టులు ఆయుధాలతో లారీలో రాళ్ళ జనగాం వైపుకు వెళ్తున్నారనే సమాచారం అందిందని దాంతో లారీని వెంబడించినట్టు రవీందర్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు. బస్వాపూర్ వైపు వెళ్ళే ప్రాంతంలో లారీ అడవిలోకి వెళ్ళిందని చెప్పారు. ఆ మార్గంలో తాము ప్రయాణీస్తోంటే లారీ తమకు ఎదురు వచ్చిందన్నారు.
36 లక్షల రివార్డును పోలీసు సిబ్బందికి ఇచ్చాను
యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఆయుధాలను నక్సలైట్ల నుండి 36 గంటల్లోనే రికవరీ చేసినట్టు రవీందర్ రెడ్డి చెప్పారు. లారీ మావోయిస్టులను దించిన ప్రాంతం నుండి మూడు రూట్లలో కూంబింగ్ చేసినట్టు చెప్పారు.ఈ కూంబింగ్లో నక్సలైట్లు తారసపడ్డారని చెప్పారు. ఎదురు కాల్పుల్లో అప్పటి మావోయిస్టు జిల్లా కార్యదర్శి కిరణ్కుమార్ చనిపోయారని చెప్పారు ఆ ఘటనలో కిరణ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు నక్సలైట్లు చనిపోయారని చెప్పారు. నక్సలైట్లపై ఉన్న రివార్డు రూ36 లక్షలను పోలీసు సిబ్బందికే తాను పంచేశానని రవీందర్ రెడ్డి చెప్పారు.