సాక్షివి తప్పుడు కథనాలు: 'వైసీపీ, టీఆర్ఎస్ కవల పిల్లలు'
హైదరాబాద్: వైసీపీ, టీఆర్ఎస్ కవల పిల్లలని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ కార్యాలయానికి తాళం అంటూ సాక్షి తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని మండిపడ్డారు.
తెలంగాణలో వైసీపీకి తాళం వేసి మాకు ఆపాదించడం మంచిది కాదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో టీడీపీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని, అలాంటి మమ్మల్ని ఎవరు ఏం చేయాలేరని చెప్పారు. మే 19 నుంచి జిల్లాల్లో టీడీపీ మినీ మహానాడులు జరపనున్నట్లు ఆయన చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వింతలే జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పూడికతీత పనుల కోసం పెద్ద పైలాన్ని ఆవిష్కరించారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని టీఆర్ఎస్ పెద్ద ఎత్తున జేబులను నింపుకుంటున్నారని విమర్శించారు.
బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రైతుల భూములు లాక్కుంటున్నారని, బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని తెలంగాణ టీడీపీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతులకు సరైన ధరలు చెల్లించే భూములను తీసుకోవాలని ఆయన సూచించారు. రైతుల నుంచి భూములు తీసుకుని వారిని బిచ్చగాళ్లుగా మార్చేలా ప్రభుత్వ చర్యలు చేపడుతోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.