రాజ్యాంగ విరుద్ధం: 'అనుబంధ విభాగాన్ని ఎక్కడైనా విలీనం చేస్తారా?'
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలంటూ ఎర్రబెల్లి దయాకరరావు అధ్యక్షతన పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్కు లేఖ ఇవ్వడాన్ని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు.
వేర్వేరు సందర్భాల్లో టీడీపీ నుంచి టీఆర్ఎస్ చేరిన ఎమ్మెల్యేలు తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పార్టీలను విలీనం చేస్తారు గానీ, అనుబంధ విభాగాన్ని విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు.
సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసిన పార్టీలో తీర్మానం చేస్తేనే విలీనం అవుతుంది తప్ప, స్పీకర్ ఆమోదిస్తే కాదన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్ రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్రపతి వద్దకు వెళతామని చెప్పారు.
అవగాహన లేని వారు టీఆర్ఎస్లో ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికారపక్షంలో ఉంటేనే అభివృద్ధి అనుకుంటే టీఆర్ఎస్ ఎంపీలను ఎన్డీఏలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లినా కాంగ్రెస్ స్పందించడం లేదని, తమకు పోరాడే శక్తి ఉన్నందున పోరాడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే శుక్రవారం టీటీడీపీ నేతలు ఆ పార్టీ అధినేత చంద్రాబబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు అనర్హత ఫిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. టీటీడీపీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.