ప్లీనరీలో కేసీఆర్ జోకులు బాగా వేశారు: కోటి ఎరకాలకు సాగునీరుపై టీటీడీపీ
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఎంతో ఘనంగా నిర్వహించిన ప్లీనరీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్లీనరీలో చేసిన ప్రకటన ఒక జోక్గా అభివర్ణించారు.
'టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అందచేసిన పుస్తకాల్లోని వివరాల ప్రకారం తెలంగాణలో ఇప్పటికే 58 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది. టీఆర్ఎస్కు ముందు గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు, నీటి వనరుల వల్ల ఈ సాగు వసతి ఏర్పడిందని ప్రభుత్వమే ఒప్పుకొంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద మరో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులు టీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందే నిర్మాణం మొదలయ్యాయి. మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే కోటి ఎకరాలకు సాగునీటి కల్పన పూర్తవుతుంది. కాని అందులో కేసీఆర్ ప్రభుత్వ పాత్ర కేవలం పది శాతానికే పరిమితం. తమ ప్రభుత్వం కొత్తగా కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తుందా లేక పాతవాటితో కలిపి ఇస్తుందా అన్నది కేసీఆర్ స్పష్టం చేయాలి. లేకపోతే ఆయన ప్రకటనలు పచ్చి మోసంగా మిగులుతాయి' అని రావుల వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ తాజాగా కోటి ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని అనుకొన్నా తెలంగాణలో అంత భూమి లేదని చెప్పారు. తెలంగాణలో మునుపెన్నడూ లేని స్ధాయిలో కరువు తాండవిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో బిర్యానీ ప్లీనరీ నిర్వహించిందని మండిపడ్డారు.
అన్ని పార్టీలు తెలంగాణలో కరువు యాత్రలు చేస్తుంటే ప్లీనరీలో టీఆర్ఎస్ పార్టీ దాని ఊసే ఎత్తలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి కరువు ఉపశమన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్భంధ పన్ను వసూళ్ళు నిలిపివేయాలని, వడదెబ్బ మరణాలకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని టీటీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కంటే ప్లీనరీ పైనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ శ్రద్ధ చూపారని ఆయన మండిపడ్డారు.