ఎర్రబెల్లి, రేవంత్ల మధ్య గొడవా?: రావుల ఆసక్తికర వ్యాఖ్య
హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతల భేటీలో ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డిల మధ్య గొడవ జరిగిందన్న విషయంపై ఇంకా రాద్ధాంతం నడుస్తూనే ఉంది. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిలు ఇద్దరూ పరిణతి చెందిన నేతలని, వారిద్దరూ అసలు గొడవే పడలేదని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి చెప్పారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో రావుల ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘ఆ ఇద్దరు నేతలు పరిణతి చెందిన నాయకులు. పార్టీ కోసం వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అది గొడవ కాదు. ఆ తర్వాత కూడా గోల్కొండ హోటల్లో జరిగిన సమావేశానికి అందరం కలిసే వెళ్లాం'' అని రావుల పేర్కొన్నారు.
వరంగల్ ఉపఎన్నిక పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థే పోటీ చేసినందున ఈసారి కూడా బీజేపీ వారికే అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి అభిప్రాయపడగా అందుకు రేవంత్ అభ్యంతరం చెప్పారు. వరంగల్లో టీడీపీకే బలం ఉందని సర్వేలు చెబుతున్నాయని కాబట్టి బీజేపీకి ఇవ్వడం సరికాదని రేవంత్ అన్నారు.
అర్థరాత్రి వెళ్లి పక్క పార్టీల వారిని కలిసి వచ్చే వారు కూడా మిత్రధర్మం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. పార్టీ సమావేశాలకు అప్పుడప్పుడు వస్తూ ఐటమ్ గర్ల్గా ఉండే నీవు కూడా సలహాలు ఇస్తావా అని రేవంత్పై ఎర్రబెల్లి మండిపడ్డారు.
ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమవుతుండగా సీనియర్లు జోక్యం చేసుకున్నారు. రేవంత్ తీరునే తప్పుపట్టారు. సీనియర్లను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. నీ వల్ల ఇప్పటికే పార్టీ చాలా నష్టపోయిందని, ఇకనైనా దుకూడు తగ్గించుకోవాలని సూచించారు.