మీ అన్నయ్య మాట్లాడరేం: పవన్ కల్యాణ్కు రావుల సూటి ప్రశ్న
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, ప్రత్యేక హోదాపై చిరంజీవి మాట్లాడకపోవడాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు.
మీ అన్నయ్య చిరంజీవిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మాటల్లో స్పష్టత లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్పై పవన్ కల్యాణ్ చేసిన విమర్శల్లో నిజం లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆయన ధ్వజమెత్తారు. విభజన చట్టం పూర్తిగా అమలు కాలేదని, దాన్ని అమలు చేయడానికి ఇబ్బందులేమిటో కేంద్రం చెప్పడం లేదని ఆయన అన్నారు. ప్రపంచంలోనే సుందర నగరంగా అమరావతిని నిర్మిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన మోడీ హామీని ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఇప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. కేంద్రానికి రాష్ట్రాలు ఇచ్చే పన్నుల కన్నా కేంద్రం నంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు చాలా తక్కువ అని రావుల అన్నారు.
లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు బిజెపి అండగా నిలుస్తోందని ఆయన తప్పు పట్టారు. బిజెపి, టిడిపి మిత్రపక్షాలైనప్పటికీ తెలంగాణలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తోందని అమిత్ షా ప్రకటించారని, అయినా తాము ఏమీ అనలేదని అన్నారు.
మిత్రధర్మం పాటించడంలో తమ తర్వాతే ఎవరైనా వస్తారని అన్నారు. చట్టపరంగా రావాల్సిన నిధులు కూడా ఎపికి రావడం లేదని అన్నారు. బిజెపిపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల కోసమే కేంద్రంపై తాము అవిశ్వాసం ప్రతిపాదించినట్లు తెలిపారు.