"కవిత కువైట్కు.. కేటీఆర్ అమెరికాకు.. కేసీఆర్ ఫామ్ హౌజ్కు!"
హైదరాబాద్ : టీఆర్ఎస్ పాలనను ఎద్దేవా చేస్తూ.. 'ఎంపీ కవిత కువైట్ కు, కేటీఆర్ అమెరికాకు, కేసీఆర్ ఫాంహౌజ్ కు వెళుతున్నారని, వీళ్లంతా తలో దిక్కు వెళ్తే రాష్ట్ర ప్రజలకు దిక్కెవరని' అన్నారు టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే.. ప్రభుత్వానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందని ప్రశ్నించారు.
గురువారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సందర్బంగా టీఆర్ఎస్ పాలనపై పలు విమర్శలు గుప్పించారు రావుల. జీహెచ్ఎంసీ దివాలా తీసేలా టీఆర్ఎస్ వ్యవహారిస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు.
ఇక అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయినా.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామిని ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని, అందుకోసం నిధులు ఎందుకు విడుదల చేయడంలేదని రావుల ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదలకు నిర్మించి ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వని సర్కార్.. మరోవైపు సీఎం, సీఎస్, డీజీపీలకు మాత్రం వందల కోట్లతో ఇళ్లు నిర్మించి ఇచ్చిందని అసహనం వ్యక్తం చేశారు రావుల.