పోయేకాలం! కేసీఆర్వి లుచ్ఛా మాటలు, అందుకే ముందస్తు: ఉత్తమ్, కుంతియా నిప్పులు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ అపద్ధర్మ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ముందస్తు ఎన్నికలు: కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే
అందుకే ముందస్తు..
నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. కేసీఆర్ అన్ని దగా మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. ప్రజలు అసంతృప్తి పెరుగుతుందనే.. వచ్చే ఏడాది జూన్ వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఉత్తమ్ అన్నారు.
కేసీఆర్ ముందస్తుకే ఓటేశారెందుకంటే..?: అంతా అనుకున్నట్లు జరిగితే రికార్డే!
తెలంగాణను నెంబర్ 1 చేసింది వీటిలోనే..
తెలంగాణ దేశంలో నెంబర్ వన్ అని కేసీఆర్ చెప్పుకుంటున్నారని.. అయితే రైతుల ఆత్మహత్యలు, అప్పులు చేయడంలోనే తెలంగాణను కేసీఆర్ నెంబర్ 1 చేశారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ కంటే 6రేట్లు జనాభా ఎక్కువున్న ఉత్తరప్రదేశ్ కంటే భారీ మొత్తంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయని అన్నారు. మద్యం అమ్మకాల్లో నెంబర్ 1 చేశారని కేసీఆర్పై మండిపడ్డారు.
కేసీఆర్వి లుచ్ఛా మాటలు.. టీఆర్ఎస్ను బొందపెడతారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉత్తమ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏం పెంచారని ప్రశ్నించారు. కేసీఆర్ తన స్థాయిని మరిచి లుచ్ఛా మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విమర్శించే స్థాయి కేసీఆర్ది కాదని అన్నారు. కేసీఆర్.. రాహుల్ను బఫూన్ అనడంపై మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తామన్నారు, ఇంటింటికీ ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్.. ఏ హామీ నెరవేర్చలేదని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఓ దగా అని అన్నారు. మిషన్ భగీరథ కింద 5శాతం గ్రామాలకు కూడా నల్లా కలెక్షన్లు ఇవ్వలేదని అన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు, గిరిజన్లకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి తయారవుతున్నారని అన్నారు.
కేసీఆర్కు పోయేకాలం...
కేసీఆర్ కుటుంబసభ్యులకు కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతారని అన్నారు. కేసీఆర్కు పోయేకాలం వచ్చింది కాబట్టే.. శాసనసభను రద్దు చేసుకున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఉత్తమ్ మరోసారి వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘంతో మాట్లాడారా? అనుమానలున్నాయి..
ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడినట్లు కేసీఆర్ మీడియా సమావేశంలో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘంపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని ఉత్తమ్ అన్నారు. అసెంబ్లీ రద్దు కాకముందే ఎన్నికల సంఘం అధికారితో మాట్లాడినట్లు కేసీఆర్ ఎలా చెబుతారని నిలదీశారు.